మణిపాల్ ఆస్పత్రి ఎండీకి జగన్ పీఏ పేరుతో మెసేజ్-క్రికెటర్ కిట్ కోసం 10.4 లక్షల డిమాండ్
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి ఇప్పటికే డబ్బులు దండుకుంటున్న వ్యవహారాలు చూస్తూనే ఉన్నాం. ఈసారి ఏకంగా సీఎం జగన్ పీఏనంటూ ఓ వ్యక్తి బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రి ఎండీకి ఓ మెసేజ్ పంపాడు. ఇందులో ఆయన డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో ఈ వ్యవహారం కలకలం రేపింది.
సీఎం జగన్ పీఏ పేరుతో బెంగళూరు మణిపాల్ ఆస్పత్రి ఎండీకి ఓ మెసేజ్ వెళ్లింది. ఇందులో ఏపీకి చెందిన ఓ అంతర్జాతీయ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ కు కిట్ ఇవ్వాలని, అందుకోసం 10 లక్షల 40 వేల 44 వేల రూపాయుల ఖర్చువుతుందని తెలిపాడు. ఈ మొత్తం తమకు పంపాలని కోరాడు. ఇందుకు బదులుగా కిట్ పై మణిపాల్ ఆస్పత్రి చిహ్నాన్ని వాడుకుంటామని కూడా ఆఫర్ చేశాడు.
దీంతో అనుమానం వచ్చిన సదరు ఎండీ.. తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రి బ్రాంచ్ కు సమాచారం అందించారు. ఈ మెసేజ్ నిజమో కాదో నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. దీంతో రంగంలోకి దిగిన తాడేపల్లి మణిపాల్ ఆస్పత్రి సిబ్బంది ఇది ఫేక్ అని నిర్ధారించారు. సీఎం జగన్ పీఏ పేరుతో వచ్చింది ఫేక్ మెసేజ్ గా నిర్ధారించుకున్నారు. దీంతో ఇదే విషయాన్ని బెంగళూరులోని ఎండీకి తెలిపారు. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలతో తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీఎం జగన్ పీకే పేరుతో బెంగళూరు మణిపాల్ ఆస్పత్రి ఎండీకి వచ్చిన ఫేక్ మెసేజ్ వ్యవహారంపై మణిపాల్ ఆస్పత్రి నుంచి ఫిర్యాదు అందుకున్న తాడేపల్లి పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జగన్ పీఏ పేరుతో మెసేజ్ వచ్చిన నంబర్ ను ట్రేస్ చేసే పనిలో పడ్డారు. ఈ మధ్య కాలంలో మంత్రుల పేరుతో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో వాటికీ, దీనికీ ఏదైనా సంబంధం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.