సీఎం ని కలసిన ఫాతిమా విద్యార్థులు
కడప ఫాతిమా వైద్య కళాశాల విద్యార్ధులకు న్యాయం చేయడానికి, సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం అన్ని మార్గాలను అన్వేషిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు.
అమరావతి:కడప ఫాతిమా వైద్య కళాశాల విద్యార్ధులకు న్యాయం చేయడానికి, సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం అన్ని మార్గాలను అన్వేషిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. సోమవారం శాసనసభలో తనను కలిసిన బాధిత విద్యార్ధులు, వారి తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి ఈమేరకు హామీ ఇచ్చారు. ఈ సమస్య జఠిలమైందని దీనిపై సంయమనం, సహనం పాటించాలని సూచించారు.
విద్యార్ధులకు ఉపశమనం లభించేలా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కోరుతూ శాసనసభలో తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. బాధిత విద్యార్ధుల్లో ఇప్పటికే నీట్ అర్హత పొందినవారికి ఫాతిమా కళాశాలలో కానీ, మరే ఇతర కళాశాలలో అయినా సీటు పొందేలా ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు అనుమతికి ప్రయత్నిస్తామని అన్నారు. నీట్ అర్హత సాధించని మిగిలిన విద్యార్ధులు వచ్చే విద్యాసంవత్సరానికి అయినా అర్హత పొందేందుకు అవసరమయ్యే కోచింగ్ అందిస్తామని, ఇందుకయ్యే వ్యయాన్ని భరించడానికి ప్రభుత్వం సిద్ధంగా వుందని తెలిపారు.
సమస్యపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకు వీలుగా కొందరు విద్యార్ధులు కమిటీగా ఏర్పడాలని ముఖ్యమంత్రి సూచించారు. కాల్ సెంటర్ ద్వారా బాధిత విద్యార్ధులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు.
అలాగే ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇందుకు సంబంధించి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని చెప్పారు. వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, అధికారులు, విద్యార్ధులు కలిసి ఢిల్లీ వెళ్లి సమస్యను మరోమారు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్దేశించారు.