పట్టు వీడిన గవర్నర్...ఎట్టకేలకు నాలా బిల్లుకు ఆమోదం
గవర్నర్ నరసింహన్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన నాలా బిల్లును ఆమోదించారు. ఏపీ కేబినెట్ పంపిన నాలా బిల్లును గవర్నర్ ఆమోదించారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన గవర్నర్ నాలా బిల్లును ఆమోదించి ఏపీ ప్రభుత్వానికి తిరిగి పంపారు.
నాలా బిల్లుపై లేఖల యుద్ధం ముగిసింది. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఎట్టకేలకు పట్టువీడారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి పంపిన నాలా బిల్లును గవర్నర్ నరసింహన్ గురువారం ఆమోదించారు. ఏపీ ప్రభుత్వం ఈ బిల్లుపై తన అభ్యంతరాలకు సంబంధించి ఇచ్చిన వివరణతో పూర్తి సంతృప్తి చెందిన గవర్నర్ నరసింహన్ తదనంతరం నాలా బిల్లును ఆమోదించి ఏపీ ప్రభుత్వానికి తిరిగి పంపారు. గవర్నర్ నిర్ణయంతో ఏపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.
నాలా అంటే...అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్...తెలుగులో భూ వినియోగ మార్పిడి గా వ్యవహరించే ఈ నాలా బిల్లులో ఫీజు తగ్గింపు, ఇతర కీలక సవరణలపై తన ఆమోదముద్ర వేసేందుకు గవర్నర్ నరసింహన్ తొలుత నిరాకరించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా పలు అభ్యంతరాలను తెలుపుతూ ఎపి ప్రభుత్వానికి లేఖలు కూడా రాసిన సంగతి తెలిసిందే. దీంతో గవర్నర్కు, ఏపీ ప్రభుత్వానికి ఈ బిల్లు విషయమై కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొనడంతో ప్రభుత్వం పంపిన బిల్లుపై రాజముద్ర వేసేందుకు పై గవర్నర్ నరసింహన్ మొదట తిరస్కరించారు.
అనంతరం ఈ బిల్లుపై అసెంబ్లీలో ఆర్డినెన్స్ను ఆమోదించి మళ్లీ గవర్నర్ నరసింహన్ కు ఎపి ప్రభుత్వం మరోసారి పంపింది. కానీ గవర్నర్ ఈ బిల్లుపై మరోసారి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎపి ప్రభుత్వానికి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో గవర్నర్ అభ్యంతరాలపై వెంటనే వివరణ ఇవ్వాలని ముఖ్యమంత్రి రెవెన్యూశాఖను సీఎం ఆదేశించడం, ఆశాఖ గవర్నర్ కు వివరణ ఇవ్వడంతో సంతృప్తి చెందిన ఆయన ఎట్టకేలకు బిల్లుపై ఆమోదముద్ర వేశారు. నాలా బిల్లుపై గవర్నర్ తీరును నిరసిస్తూ బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించిన సంగతి గమనార్హం.