షాకింగ్: అమ్మో.. యనమల 'పంటి' చికిత్సకు 2.88 లక్షలు, చంద్రబాబు అసహనం
Recommended Video
అమరావతి: ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుకు రూట్ కెనల్ ట్రీట్మెంట్ జరిగింది. దీనికి అక్షరాలా రు.2.88వేలు ఖర్చు అయింది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు విభజన కారణంగా ఏపీ ఇబ్బందుల్లో ఉందని, అఫ్పుల్లో ఉందని చెబుతున్న ప్రభుత్వం, మరో వైపు యనమల చికిత్సకు రూ.లక్షలు ఖర్చు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే, మంత్రి చికిత్సకు లక్షలు పెట్టినందుకు విమర్శలు రావడం లేదు. ఆ చికిత్సకు వేలల్లో అవుతుందని, కానీ దానికి పది రెట్లు ఖర్చు చూపిస్తున్నందుకు అందరూ మండిపడుతున్నారు. గురువారం విడుదల చేసిన జీవో ప్రకారం యనమల ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన సింగపూర్లోని సిక్స్త్ అవెన్యులోని అజురె డెంటల్ ఆసుపత్రిలో రూట్ కెనాల్ చికిత్స చేయించుకున్నారు.
రూట్ కెనాల్ చికిత్స కోసం సింగపూర్ వెళాలా?
ఆసుపత్రిలో ఈ చికిత్సకు రూ.2,88,823 ఖర్చు అయినట్లు బిల్లు సమర్పించారు. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవో ఇప్పుడు నెట్లో వైరల్ అయింది. రూట్ కెనాల్ చికిత్సకు సింగపూర్ వెళ్లాలా అని కొందరు, ఇండియాలో ఈ చికిత్స మానేశారా అని మరికొందరు విమర్శలు చేస్తున్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చాలామంది మండిపడుతున్నారు.
ఎన్నో రెట్లు ఎక్కువగా
సమాచారం మేరకు సాధారణంగా మన వద్ద ఈ చికిత్సకు రూ.5వేలకు కాస్త అటు ఇటు ఖర్చు అవుతాయని, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అయితే రూ.10వేల వరకు అవుతుందని చెబుతున్నారు. కానీ యనమలకు చికిత్స కోసం అందుకు ముప్పై రెట్లు అయిందని అంటున్నారు. మన దేశంలో ఎన్నో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉండగా, వాటిని కాదని సింగపూర్ వెళ్లి, అజుర్ డెంటల్ ఆసుపత్రిలో చేయించుకోవాలా అని ప్రశ్నిస్తున్నారు.
మరో ట్విస్ట్.. అజుర్ డెంటల్ ఆసుపత్రి వెబ్ సైట్లో ఇలా
ప్రభుత్వం విడుదల చేసిన నిధులకు, అజుర్ ఆసుపత్రి వెబ్ సైట్లో పొందుపర్చిన వివరాలకు ఏమాత్రం పొంతన లేదని కూడా అంటున్నారు. దాని ప్రకారం ఎంత లెక్క వేసినా రూ.66వేలు అవుతుందని, కానీ ప్రభుత్వం రూ.2.88 లక్షలు చెల్లించడం ఏమిటని అంటున్నారు. రూట్ కెనాల్ చికిత్సకు రూ.2.88 లక్షలు కావడంపై బీజేపీ నేత జీవీఎల్ విస్మయం వ్యక్తం చేశారు.
చంద్రబాబు అప్సెట్
యనమల రూట్ కెనాల్ ట్రీట్మెంట్కు పెద్ద ఎత్తున ఖర్చు కావడం, దానిపై తీవ్ర విమర్శలు రావడంతో సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై చంద్రబాబు అప్ సెట్ అయినట్లుగా తెలుస్తోంది. శుక్రవారం ఉండవల్లిలో పార్టీ కోర్ కమిటీ సమావేశంలో జరిగింది. ఇలా జరగాల్సింది కాదని చంద్రబాబు అనగా.. దానికి టీడీపీ నేతలు మాట్లాడుతూ.. యనమల సింగపూర్లో ఉండగా అనుకోకుండా జరిగిందని చెప్పారని తెలుస్తోంది.
ఏం జరిగిందంటే.. టీడీపీ నేత వివరణ
యనమల సింగపూర్ వెళ్లకముందే హైదరాబాదులోని ఏపీ డెంటల్ ఆసుపత్రికి వెళ్లారని టీడీపీ నేత లంకా దినకరన్ వెల్లడించారు. కానీ చికిత్స పూర్తి కాకముందే, సింగపూర్ ట్రిప్కు వెళ్లారని చెప్పారు. యనమల సింగపూర్ చేరిన తర్వాత తీవ్రమైన నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరి, చికిత్స చేయించుకున్నారని చెప్పారు.