కృష్ణా జిల్లాలో చేపల వర్షం: ఎగబడి ఏరుకున్న జనం
విజయవాడ: కృష్ణా జిల్లా నందిగామ మండలం గొళ్లమూడిలో గురువారం రాత్రి చేపల వర్షం కురిసింది. దీంతో శుక్రవారం ఉదయం రైతులంతా రోడ్లపైనే బుట్టలు పట్టుకొని వాటిని ఏరుకుంటున్నారు.
అంతే కాదు వర్షం కురిసే సమయంలో ఈ చేపలు ఏంటంటూ ఆశ్చర్యపోయారు. పొలాల్లో, గ్రామాల్లో పడిన చేపలను ఏరుకుని ప్రజలు వాటిని ఇంటికి తీసుకెళ్లారు. అది కూడా వాలుగ రకం చేపలు కావడంతో జనం వీటి కోసం ఎగబడుతున్నారు.
ఆకాశం నుంచి పడిన చేపలు 'వాలగ' రకానికి చెందినవిగా గ్రామస్థులు చెబుతున్నారు. సుమారు మూడు నుంచి నాలుగు కిలోలు ఉన్న చేపలు కూడా ఉన్నాయి. వర్షంతో పాటు ఆకాశం నుంచి చేపలు పడటంతో జనం ఆసక్తిగా వీటి గురించి చర్చించుకుంటున్నారు.
వర్షంతో పాటు చేపలు కురుస్తున్నాయంటూ పక్క గ్రామాల ప్రజలకు తెలియడంతో వారు కూడా అక్కడకు చేరుకుని వాటిని ఏరుకుని తీసుకెళ్తున్నారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే గతంలో థాయ్లాండ్ చోటు చేసుకుంది.
ఈ చేపల వాన వెనకు పెద్ద సైన్సు ఉందని సమాచారం. ఆకాశం నుంచి కింద పడే చేపలు నిజంగా ఆకాశం నుంచి రాలి పడవంట. ఇవి చుట్టుపక్కల ఉన్న సముద్రాల నుంచి వస్తాయంట. ఈ విషయంపై వాతావరణ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనాల ప్రకారం వాతావరణంలోని మార్పుల వల్ల టోర్నడోలు ఏర్పడతాయి.
ఈ టోర్నడోలు విపరీతమైన వేగంతో ప్రయాణిస్తూ ఉంటాయి. ఇవి నీటిపై ప్రయాణించే సమయంలో ఆ నీటిని అపరమితమైన శక్తితో పైకి లాగుతాయి. చేపలు, కప్పలు వంటి సముద్ర జంతువులు కూడా టోర్నడోలతో పాటుగా ప్రయాణిస్తాయి.
కొంచెం సేపు ప్రయాణించిన తర్వాత ఈ టోర్నడోలు శక్తి హీనమవుతాయు. అలాంటప్పుడు సముద్రంలోని చేపలు వానలా కురుస్తాయి. సాధారణంగా ఈ టోర్నడోలు కొన్ని వందల కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తుంటాయి.