ఏపీ అప్పులెంతో తేల్చేసిన కేంద్రం.. ! రఘురామ ప్రశ్నకు నిర్మలమ్మ జవాబు..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీస్ధాయిలో అప్పులు చేస్తోందని నిత్యం విపక్షాలు విమర్శిస్తూనే ఉంటాయి. దీనికి జవాబుగా టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల్ని వైసీపీ నేతలు తెరపైకి తెస్తుంటారు. అయితే వీరి విమర్శలు, ప్రతి విమర్శల్లో ఏపీ అసలు అప్పులెంత అనే విషయం సాధారణ ప్రజలకు అర్ధం కావడం లేదు. ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం మరోసారి పార్లమెంటులో ఏపీ అప్పులెంతో తేల్చిచెప్పేసింది.
ఏపీలో జగన్ సర్కార్ ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తోందని, ఎఫ్ఆర్బీఎం పరిమితిని దాటి అప్పులు చేస్తోందని, అసెంబ్లీకి కూడా వివరాలు ఇవ్వడం లేదని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ లోక్ సభలో కేంద్రం దృష్టికి తెచ్చారు. అసలు అప్పులెంతో చెప్పమని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ప్రశ్నించారు. దీంతో స్పందించిన ఆమె.. ఏపీ అసలు అప్పులెంతో తేల్చిచెప్పేశారు. తాజాగా ఓసారి పార్లమెంటులో దీనిపై స్పష్టత ఇచ్చిన నిర్మల.. ఈసారి మరింత క్లారిటీగా బదులిచ్చారు.

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వం ముగిసి వైసీపీ ప్రభుత్వం వచ్చే నాటికి ఉన్న అప్పు.. 2019 మార్చి నాటికి రూ.2,64,451 కోట్లు అని ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అలాగే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అప్పులతో కలిపి ఇప్పుడు ఆ సంఖ్య రూ.4,42,442 కోట్లకు చేరుకున్నట్లు నిర్మల వెల్లడించారు. అంటే వైసీపీ సర్కార్ ఈ నాలుగేళ్లలో చేసిన అప్పు రూ.1,77,991 కోట్లుగా నిర్మల పార్లమెంటు సాక్షిగా మరోసారి తేల్చేశారు.
అంతటితో ఆగకుండా మరిన్ని వివరాలు కూడా ఆమె వెల్లడించారు. ఏపీ అసెంబ్లీ ఎఫ్ఆర్బీఎం పరిమితిని పర్యవేక్షిస్తుందని నిర్మల తెలిపారు. ఈ లెక్కన ఆర్ధిక సంఘం సిఫార్సులకు లోబడే ఏపీ అప్పులు ఉన్నట్లు ఆమె తేల్చిచెప్పారు. ఏపీ ఆర్ధిక పరిస్దితి ఎఫ్ఆర్బీఎం పరిమితిలోనే ఉందని నిర్మల స్పష్టం చేశారు. దీంతో ఏపీలో ఇన్నాళ్లు విపక్షాలు ప్రభుత్వం అప్పుల్లో మునిగిపోయిందంటూ చేస్తున్న ఆరోపణలు ఒట్టివేనని తేలిపోయాయి.












Click it and Unblock the Notifications