YS Jagan: అసెంబ్లీకి జగన్-విపక్ష హోదా లేకపోయినా కారుతో ఎంట్రీకి అనుమతి..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కొత్త శాసనసభ కొలువుదీరింది. ఇవాళ ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ హాజరయ్యారు. వైసీపీ తరఫున ఎన్నికైన 10 మంది ఎమ్మెల్యేలతో కలిసి జగన్ అసెంబ్లీకి వచ్చారు. అయితే ఈసారి విపక్ష హోదా లేకపోవడంతో జగన్ కు ఎలాంటి ప్రోటోకాల్ లభించలేదు. అయితే ఓ విషయంలో మాత్రం ప్రభుత్వం ఆయనకు గౌరవం కల్పించింది.
ఉదయం అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి బయలుదేరి వచ్చిన జగన్ శాసనసభ ప్రాంగణంలోకి కారుతో పాటు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఈసారి విపక్ష హోదా లేకపోవడంతో ఆయన కారుతో పాటు మిగతా వైసీపీ ఎమ్మెల్యేల కార్లను అసెంబ్లీ బయటే ఉంచి లోపలోకి నడుచుకుంటూ రావాల్సి ఉంది. అయితే విపక్ష హోదా లేకపోయినా మాజీ సీఎం కావడంతో ఆయనను కారుతో పాటు లోపలోకి అనుమతించేలా శాసనసభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో జగన్ కారును అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించారు.

వాస్తవానికి జగన్ కు విపక్ష నేత హోదా లేకపోవడంతో ఆయన కారును అసెంబ్లీ బయటే ఉంచి లోపలోకి రావాల్సి ఉన్నా సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆయన్ను కారుతో పాటు లోపలికి అనుమతించినట్లు మంత్రి పయ్యావుల తెలిపారు. జగన్ హోదా తగ్గించవద్దని సీఎం ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. దీంతో అసెంబ్లీలోనూ జగన్ కు ఆ మేరకు ఇబ్బందుల్లేకుండా చూసేందుకు ప్రభుత్వం సిద్దమైనట్లు తెలుస్తోంది.
అసెంబ్లీలో విపక్ష హోదాకు అవసరమైన 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోలేకపోవడంతో సాధారణ ఎమ్మెల్యేకు లభించే సౌకర్యాలే ఆయనకు కల్పించనున్నారు. ప్రోటోకాల్ తో పాటు ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించరు. అసెంబ్లీ లాబీల్లో విపక్ష నేతకు ఉండే ప్రత్యేక ఛాంబర్ కూడా ఇవ్వడం లేదు. దీంతో జగన్ ఈసారి వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష కార్యాలయంలోనే ఇతర ఎమ్మెల్యేలతో కలిసి కూర్చోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఈ విషయంలో ఏదైనా ప్రత్యేక వెసులుబాటు ఇస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications