100 రోజుల్లో ఏపీ సర్కార్ పతనం-ఆయన ఐదారు గంటలూ పడుకోవట్లేదు- చింతామోహన్ కామెంట్స్..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకుంది. మరో ఏడాదిలో ఎన్నికలకు వెళ్లబోతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై విపక్షాల దాడి పెరుగుతోంది. అదే సమయంలో వైసీపీ కూడా విపక్షాలకు అస్సలు అవకాశం ఇవ్వకుండా ముందుకెళ్తోంది. దీంతో విపక్షాల మాటల దాడి మరింత పెరుగుతోంది. ఇదే క్రమంలో కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతామోహన్ మరోసారి జగన్ పై, ఆయన ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
విజయవాడలో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో మాజీ ఎంపీ చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పరిస్ధితులు అస్సలు బాగోలేవన్నారు. టీవీల్లో చూస్తే ఆయనకు బెయిల్, ఈయనకు జైలు వంటి వార్తలే కనిపిస్తున్నాయంటూ పరోక్షంగా వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్తావించారు. ఇలాంటి పాలనతో ఏపీ పూర్తిగా భ్రష్టుపట్టిపోతోందని చింతా మోహన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఆర్ధిక, రాజకీయ కారణాల్లో చిక్కుకుందంటూ చింతా మోహన్ మరో విమర్శ కూడా చేశారు.

ఏపీ సర్కార్ వంద రోజుల్లో కూలిపోతుందంటూ చింతా మోహన్ జోస్యం చెప్పారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అన్ని వైపులా ఇబ్బందులు ఎదుర్కొంటోందని వెల్లడించారు. మరోవైపు వైఎస్ జగన్ పైనా చింతా నిశిత విమర్శలు చేశారు. తన మిత్రుడీ కొడుకు సీఎం అయ్యాడని అనుకున్నానని, కానీ ఒక్క ఛాన్స్ అని రాష్ట్రాన్ని అన్నివిధాలా నాశనం చేశారని చింతా మోహన్ విమర్శించారు. తద్వారా మాజీ సీఎం వైఎస్సార్ తో తన అనుబంధాన్ని కూడా గుర్తుచేశారు.
ఏపీలో సీఎం జగన్ తాజా పరిస్ధితిపైనా చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ రోజుకు ఐదారు గంటలు కూడా నిద్ర పోవడం లేదన్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో వైసీపీలోకి వెళ్లిన నేతలంతా తిరిగి కాంగ్రెస్ లోకి రావాలని చింతా కోరారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ విజయం ఖాయమని మాజీ ఎంపీ చింతా మోహన్ ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications