వైసీపీని వాలంటీర్లు ఎలా ఓడించారంటే ? మాజీ మంత్రి షాకింగ్ కామెంట్స్..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్దను తొలిసారి అమల్లోకి తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 2.67 లక్షల మంది వాలంటీర్లను ప్రభుత్వం అప్పట్లో నియమించింది. సంక్షేమ పథకాలను లబ్దిదారులకు మరింత మెరుగ్గా అందించేందుకు అంటూ వీరిని జగన్ సర్కార్ నియమించింది. అయితే వీరు సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపికలో జోక్యం చేసుకోవడంతో పాటు ప్రతీ ఎన్నికల్లో వాటి పేరు చెప్పి లబ్దిదారుల ఓట్లు వైసీపీకి పడేలా చూసేవారు. కానీ గత ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీకి హ్యాండ్ ఇచ్చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయానికి వాలంటీర్లు ఉపయోగపడలేదనే అంశంలో అందరికీ క్లారిటీ ఉంది. కానీ వైసీపీ నేతలు మాత్రం వాలంటీర్లకు కూటమి సర్కార్ అన్యాయం చేసిందని ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు. కానీ తొలిసారి తమ పార్టీ వైసీపీకి సైతం వారు ఉపయోగపడలేదని, వారి వల్లే తాము ఓటమి పాలైనట్లు జగన్ మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ తొలిసారి వ్యాఖ్యానించారు. వాలంటీర్ల వల్ల వైసీపీ ఓలా ఓడిపోయిందో ఆయన తాజాగా జరిగిన అనకాపల్లి వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో వెల్లడించారు.

వైసీపీ హయాంలో తాము ఎన్నో సంక్షేమ పథకాలను వాలంటీర్ల ద్వారానే అమలు చేశామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. అయినా ఎన్నికల్లో వాలంటీర్ల వల్లే ఓడిపోయామని చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లు రాజీనామా చేస్తే అధికారంలోకి వచ్చాక తిరిగి వారిని తీసుకుంటామని చెప్పామని, అయినా చాలా మంది రాజీనామా చేయకుండా ఉండిపోయారన్నారు. వారంతా గెజిటెడ్ ఉద్యోగుల్లా వ్యవహరించారన్నారు.
అదే సమయంలో చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్లను తీసేస్తామని తాము చెప్పినా పట్టించుకోలేదన్నారు. మొత్తానికి వాలంటీర్ల వ్యవస్థ వల్ల అధికారం కోల్పోయామన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో తిరిగి కార్యకర్తలకే పెద్దపీట వేస్తామని వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన గుడివాడ అమర్నాథ్ హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications