మోదీపై చంద్రబాబు తిట్లను గుర్తు చేసిన పేర్ని నాని
Perni Nani: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ.. ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమికి తొలి బహిరంగ సభను నిర్వహిస్తోంది. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో ఈ సభ ఏర్పాటైంది. దీనికి ప్రజాగళం అని పేరు పెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్.. ఈ సభలో పాల్గొన్నారు.
ఇందులో వారు చేసిన ప్రసంగాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ-జనసేన- బీజేపీ తొలి బహిరంగ సభ వెలవెలబోయిందని వ్యాఖ్యానించారు. ఈ సభపై జనంలో ఎలాంటి ఆసక్తి లేదని ఆయన తేల్చి చెప్పారు. తాము వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నామనే సందేశాన్ని ప్రజలు ఇచ్చినట్టయిందని పేర్కొన్నారు.

ప్రతిపక్షాల చిలకలూరిపేట సభ తమకు అయిదో సిద్ధంగా సభగా కనిపించిందని పేర్ని నాని అభివర్ణించారు. ఈ సభకు వెళ్లకపోవడం ద్వారా జనం తమ వెంటే ఉన్నారనే విషయాన్ని స్పష్టం చేశారని అన్నారు. బీజేపీని పాచిపోయిన లడ్లుగా విమర్శించిన పవన్ కల్యాణ్కు చిలకలూరిపేట సభలో అవి తాజాగా ఎలా మారాయని ప్రశ్నించారు.
భార్యను సరిగ్గా చూసుకోలేని వాడు దేశాన్ని ఏం పాలిస్తాడంటూ నిండు అసెంబ్లీలో ప్రధాని మోదీని అవమానించిన నోటితోనే చంద్రబాబు.. ఇప్పుడు మోదీని పొగుడుతున్నాడని, దేశానికి సమర్థుడైన నాయకుడు దొరికాడని ప్రశంసించాడని పేర్ని నాని అన్నారు. ఊసరవెల్లిని మించిన స్థాయిలో రంగులను మార్చుతున్నాడని ధ్వజమెత్తారు. అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమే అన్నట్లుగా మోదీ ముందు చంద్రబాబు ప్రవర్తించారని చెప్పారు.
సభలో మోదీ ప్రసంగించేటప్పుడు మైక్ పని చెయ్యకుండా చేశారని, ఇది ఆయనను అవమానించినట్టు కాదా? అని పేర్ని నాని ప్రశ్నించారు. కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో 40 దేవాలయాలను ధ్వంసం చేసిన చంద్రబాబుతో మోదీ సాహవాసం చేయడం ఏమిటని అన్నారు.
పోలవరం ప్రాజెక్టు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాలపై చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని పేర్ని నాని నిలదీశారు. రాష్ట్ర ప్రయోజనాల గురించి ప్రధానిని ఎందుకు అడగలేదని అన్నారు. రాష్ట్రంలో ఇన్ని పోర్టులను తాము కడుతుంటే కేంద్రం ఒక్కదానికి కూడా సహాయం చేయలేదని చెప్పారు.
వైసీపీ, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని ఎవ్వడు నమ్మడని పేర్ని నాని అన్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా నమ్మవని ఎద్దేవా చేశారు పేర్ని నాని. మోదీకి వ్యతిరేకంగా ఆయనను దింపేస్తామంటూ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని తిరిగిన చంద్రబాబును పక్కన పెట్టుకుని.. మోదీ ఈ మాట అనడం సరికాదని అన్నారు.












Click it and Unblock the Notifications