ఎపి ప్రభుత్వంపై మాజీ ఎంపి యార్లగడ్డ సంచలన ఆరోపణలు:రాష్ట్రంలో తెలుగును చంపేస్తోంది
గుంటూరు జిల్లా : రాజ్యసభ మాజీ ఎంపి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఎపి ప్రభుత్వంపై,సిఎం చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో తెలుగు భాషను ఎపి ప్రభుత్వమే చేజేతులా చంపేస్తోందని రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆరోపించారు. శనివారం గుంటూరుజిల్లా నరసరావుపేటలో పర్యటన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేశారు.
నర్సరావుపేటలో మీడియా సమావేశం సందర్భంగా రాజ్యసభ మాజీ ఎంపి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో పాలనా వ్యవస్థ తెలుగులో ఉండాలని, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ తెలుగులోనే ఉండాలని ఎపి ముఖ్యమంత్రి ఉత్తర్వులు ఇచ్చినా, అధికారులు వాటిని అమలు చేయటం లేదని చెప్పారు. ఉత్తర్వులు ఇవ్వడమే కాదు వాటిని అమలు చేయాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రిదేనని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ స్పష్టం చేశారు.

గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాజమండ్రికి తెలుగు విశ్వ విద్యాలయాన్నితెస్తామని హామీ ఇచ్చారని, అయితే అలా హామీ ఇచ్చి మూడున్నర ఏళ్లు గడిచినా హైదరాబాద్లో ఉన్న తెలుగు విశ్వ విద్యాలయాన్ని ఇక్కడకు తీసుకురాలేదన్నారు. అలాగే ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగు ఒక బోధనా సబ్జక్టుగా తప్పనిసరి అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని, కానీ దీనికి సంబంధించిన ఉత్తర్వులు మాత్రం నేటికీ రాలేదన్నారు.
సిఎం చంద్రబాబు చేస్తున్నమంచి పనులను అభినందిస్తున్నానని, ఐతే తెలుగు భాష పరిరక్షణకు సంబంధించి మాత్రం ఆయన ఎటువంటి చర్యలు చేపట్టక పోవటం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నానని రాజ్యసభ మాజీ ఎంపి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ విమర్శించారు.












Click it and Unblock the Notifications