ఏపీ రాజకీయాల్లో ఇసుక తుఫాన్: 35 లక్షల టన్నులు హాంఫట్
Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. ప్రకటించిన ఉచిత ఇసుక పాలసీ రాష్ట్రంలో దుమారం రేపుతోంది. ఉచితం- అని ఒక్క పక్క అంటూనే.. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో కంటే మూడింతలు అధికంగా డబ్బులను వసూలు చేస్తోండటం కాకరేపుతోంది.
చంద్రబాబు విధానాలను వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తప్పు పట్టారు. ఉచిత ఇసుక పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలను దారుణంగా మోసం చేస్తోందని మండిపడ్డారు. ఉచితం అంటూనే ఛార్జీలు బాదేస్తోన్నారని ధ్వజమెత్తారు. ఇసుక రీచ్లలో రేట్లతో ఫ్లెక్సీలు పెట్టి మరీ డబ్బులు వసూలు చేస్తోన్నారని మండిపడ్డారు.

తమ ప్రభుత్వ హయాంలో ఇసుక అమ్మకాల ద్వారా సంవత్సరానికి 750 కోట్ల ఆదాయం రాష్ట్ర ఖజానాకు వచ్చిందని, ఇప్పుడు ఆ సొమ్మంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోందని ప్రశ్నించారు. ప్రజలపై ఒక్క రూపాయి కూడా భారం మోపకుండా ఉచితంగా ఇసుక ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలకు తూట్లు పొడవడం చంద్రబాబుకు కొత్తేం కాదని సుధాకర్ బాబు ఎద్దేవా చేశారు. 2014లో అధికారంలోకి వచ్చాక ఏకంగా మేనిఫెస్టోనే మాయం చేసిన ఘనత ఆయనకు ఉందని గుర్తు చేశారు. ఇసుక ఉచితంగా ఇస్తానన్న చంద్రబాబు మరోసారి ప్రజలందరినీ బోల్తా కొట్టించారని చెప్పారు.
సీనరేజీ, లోడింగ్, ట్రాన్స్ పోర్ట్, ర్యాంప్ నిర్వహణ, దానికి అయ్యే ఖర్చులు, మెరిట్ ఫీజులు, జీఎస్టీ అంటూ రకరకాల పేర్లతో డబ్బులు వసూలు చేసి ఉచితం అని ఎలా చెబుతారని టీజేఆర్ ప్రశ్నించారు. ప్రజలకు విపరీతంగా హామీలిచ్చి గెలిచిన తరువాత వాటిని తుంగలో తొక్కడం చంద్రబాబు నైజం అని విమర్శించారు. ఉచితం పేరుతో సామాన్యుడిపై మోయలేని భారం మోపారని ఆరోపించారు.

చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడే నాటికి 80 లక్షల టన్నుల ఇసుక స్టాక్ యార్డుల్లో అందుబాటులో ఉందని, ఇప్పుడు 45 లక్షల టన్నులే ఉన్నట్టు ప్రభుత్వం చెబుతోందని టీజేఆర్ అన్నారు. 35 లక్షల టన్నుల ఇసుకను ఎవరు మాయం చేశారని ఆయన ప్రశ్నించారు. కోట్ల రూపాయల విలువ చేసే ఇసుకను టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కొట్టేశారా? అని నిలదీశారు.
ఉచితం పేరుతో సహజ వనరులను సైతం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పూర్తిగా దోచుకుంటోన్నారని, కొందరు ప్రైవేటు వ్యక్తులు కూడా ఈ దోపిడీకి పాల్పడుతున్నట్లు గతంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వ్యాఖ్యానించిందని టీజేపీ సుధాకర్ బాబు పేర్కొన్నారు.
2016-19 మధ్య కాలంలో 1000కి పైగా కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఉచితంగా నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, కార్యకర్తలను పెట్టుకుని పూర్తిగా దోచేశారంటూ అప్పట్లో హైకోర్టు కూడా చీవాట్లు పెట్టిందని అన్నారు. ఉచిత ఇసుక విధానాన్ని తుంగలో తొక్కడాన్ని నిరసిస్తున్నామని, వెంటనే ప్రజలకు ఎక్కడికక్కడ అవసరమైన మేరకు ఉచితంగా ఇసుకను అందించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications