విషాదం: అనంతలో ఒకే ఆస్పత్రిలో నలుగురు కోవిడ్ పేషెంట్లు మృతి.. ఆక్సిజన్ కొరత ఆరోపణలు
అనంతపురంలో విషాదం చోటు చేసుకుంది. నగరంలోని ఓ క్యాన్సర్ ఆస్పత్రిలో ఒకేరోజు నలుగురు కోవిడ్ పేషెంట్లు మృతి చెందారు. ఆక్సిజన్ కొరత వల్లే పేషెంట్లు చనిపోయారని మృతుల కుటుంబ సభ్యులు,బంధువులు ఆరోపిస్తున్నారు. కోవిడ్ బాధితుల మృతి గురించి తెలిసిన వెంటనే కలెక్టర్ గంధం చంద్రుడు,ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఘటనపై వైద్య సిబ్బందిని ఆరా తీస్తున్నారు.
మూడు రోజుల క్రితం అనంతపురంలోని జనరల్ ఆస్పత్రిలోనూ 10 మంది కోవిడ్ పేషెంట్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆక్సిజన్ అందకే తమవాళ్లు చనిపోయారని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించగా... అధికారులు మాత్రం సాధారణ మరణాలే అని వెల్లడించారు.ఆక్సిజన్ సపోర్ట్తో చికిత్స పొందుతున్నవారికి పైప్లైన్ ద్వారా దాన్ని సరఫరా చేయడంలో సాంకేతిక సమస్య తలెత్తిందని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించారు.పైప్ లైన్ నిర్వహణలో లోపాలే తమవాళ్ల మరణాలకు కారణమన్నారు.పేషెంట్ల మృతి గురించి తెలియగానే కలెక్టర్ గంధం చంద్రుడు, జాయింట్ కలెక్టర్ నిశాంత్కుమార్, ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి ఆస్పత్రిని సందర్శించారు.

ఆస్పత్రిలో సరిపడా ఆక్సిజన్ ఉందని... ఆక్సిజన్ సరఫరాలోనూ ఎటువంటి సమస్య లేదని కలెక్టర్ వెల్లడించారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడం వల్లే పేషెంట్లు చనిపోయారని.. అంతే తప్ప ఆక్సిజన్ కొరత అన్న ప్రచారంలో నిజం లేదని అన్నారు.
ఇక రాష్ట్రంలో కరోనా కేసుల విషయానికి వస్తే... గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 20,034 పైచిలుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 82 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ మొత్తం కేసుల సంఖ్య 11,84,028కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 8289కి చేరింది.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,15,784 కరోనా పరీక్షలు నిర్వహించగా ఇప్పటివరకూ 1,68,33,932 కరోనా టెస్టులు నిర్వహించారు. మరో 12,207 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ మొత్తం10,16,142 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,59,597 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజాగా నమోదైన కేసుల్లో శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 2398, అత్యల్పంగా కడప జిల్లాలో 793 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన మరణాల్లో అనంతపురం,విజయనగరం,విశాఖపట్నం,తూర్పు గోదావరి జిల్లాల్లో 9 మంది చొప్పున,నెల్లూరులో 7 మంది,కృష్ణా జిల్లాలో 6 మంది,గుంటూరులో 5 మంది,చిత్తూరు,కర్నూలు,ప్రకాశం,శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు.












Click it and Unblock the Notifications