మంత్రి పదవికి బొత్స రాజీనామా: మరో నలుగురు?
హైదరాబాద్: పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తన మంత్రి పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆయన శుక్రవారం గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్తో భేటీఅయ్యారు. ఇరువురూ రాష్ట్ర పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. బొత్స గవర్నర్ను కలవడంతో మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు వదంతులు వ్యాపించాయి.
ఆయన మాత్రం అన్ని విషయాలు శనివారం మాట్లాడుకుందాంమంటూ దాట వేశారే తప్ప కథనాలను ఖండించలేదు. తాను రాజీనామా చేయబోతున్న విషయాన్ని బొత్స గవర్నర్కు చెప్పినట్లు సమాచారం. సీమాంధ్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు కొంత మంది తమ రాజీనామాలను శనివారం ఆమోదింపజేసుకుంటారని అంటున్నారు. వారి రాజీనామాల విషయం తెలిసిన తర్వాత బొత్స నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.
పార్లమెంటు సభ్యులతో బొత్స సత్యనారాయణ ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో మరో నలుగురు మంత్రులు కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గం నుంచి తప్పుకుంటారని అంటున్నారు. ఇప్పటికే విశ్వరూప్ తన మంత్రి పదవికి రాజీనామా చేస్తూ నేరుగా గవర్నర్కు లేఖ ఇచ్చారు.
సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్, అనంత వెంకట్రామిరెడ్డి, సాయి ప్రతాప్, ఎస్పివై రెడ్డి తమ పార్లమెంటు సభ్యత్వాలకు రాజీనామాలు చేసి, పార్టీని కూడా వదులుతారనే ప్రచారం సాగుతోంది. ఇదిలావుంటే, మంత్రి మాణిక్య వరప్రసాద్, ఎంపి రాయపాటి సాంబశివ రావు కూడా గవర్నర్తో సమావేశమయ్యారు.