శిఖండిలా రోజా...: జగన్పై గాలి, బిజెపి ఎమ్మెల్యే టిడిపి రాగం
హైదరాబాద్: చిత్తూరు జిల్లా నగరి శాసనసభ్యురాలు రోజాను శిఖండిలా ముందుపెట్టి జగన్ రాజకీయాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత గాలిముద్దుకృష్ణమనాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పట్లో ఎమ్మెల్యేలను జగన్ ఎంతకుకొన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ సర్కస్ పార్టీలా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.
బిజెపి, టిడిపి మిత్రబంధం కొనసాగాలనేది ప్రజా తీర్పు భిన్నాభిప్రాయాలు సహజమని బిజెపి శాసనసభ్యుడు విష్ణుకుమార్రాజు అన్నారు. సమస్యలు పరిష్కరించుకోవడానికి వేదికలున్నాయని ఆయన తెలిపారు. బీజేపీ - టీడీపీ కలయిక రాష్ట్రానికి మేలు చేస్తుందని విష్ణుకుమార్ రాజు తెలిపారు. విడిపోవడమన్నది తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయంగా ఉండాలని బీజేపీ నేత విష్ణుకుమార్రాజు అభిప్రాయపడ్డారు.
కార్యకర్తల అభీష్టం మేరకే...
ఈనెల 8న టీడీపీలో చేరనున్నట్లు పత్తిపాడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు ప్రకటించారు. విజయవాడలో చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నట్లు చెప్పారు. అభిమానులు, కార్యకర్తల అభీష్టం మేరకే పార్టీ మారాలని నిర్ణయించినట్లు వరపుల తెలిపారు.
యనమల శకుని పాత్ర
ఆంధ్రప్రదేశ్ శానససభ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శుకుని పాత్రను పోషించారని వైస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యుడు వై. విశ్వేశ్వర రెడ్డి వ్యాఖ్యానించారు. బడ్జెట్ సమావేశాలు నిరాశను కలిగించాయని ఆయన శనివారం అనంతపురంలో మీడియా సమావేశంలో చెప్పారు.
ఈ సమావేశాల్లో ప్రజా సమస్యలపై కన్నా రాజకీయ ప్రయోజనం కోసమే చంద్రబాబు ఎక్కువగా ప్రయత్నించారని ఆయనఅన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై పోరుబాటను మరింత ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు.