‘భగవంతుడా! జగన్కు మంచి బుద్ధిని ప్రసాదించు’
కృష్ణా: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ తెలుగుదేశం నేతలు వినూత్నంగా గణపతి హోమాన్ని నిర్వహించారు. కృష్ణా జిల్లా చల్లపల్లిలో టీడీపీ నేలు ఈ హోమాన్ని నిర్వహించారు. నవ్యాంధ్ర నిర్మాణాన్ని అడుగడునా అడ్డుకునేందుకు జగన్ కుటిల యత్నాలు చేస్తున్నారని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు.
జగన్ కుతంత్రాలకు అడ్డుకట్ట వేసి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంతా మంచి జరిగేలా ఆశీర్వదించాలని దేవుడిని కోరుకున్నారు. స్థానిక లయన్స్ కాంప్లెక్స్ వద్ద ఈ హోమం నిర్వహించారు. పురోహితుడు వేమూరి శ్రీనివాస్ శాస్త్రోక్తంగా గణపతి హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలతో పాటు స్థానిక రైతులు కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవీ వ్యామోహంతోనే జగన్ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. దీక్షల పేరుతో ప్రజల్లో అలజడి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ చేస్తున్న తప్పిదాలను ప్రజలు కూడా గమనిస్తున్నారని తెలుగుదేశం నాయకులు అన్నారు. కాగా, తెలుగుదేశం ప్రభుత్వంపై జగన్ తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ హోమాన్ని నిర్వహించారు.