గన్నవరం వైసీపీలో మరోసారి: వంశీ వర్సస్ యార్లగడ్డ - సీఎం తేల్చేస్తారా..!!
గన్నవరం వైసీపీలో విభేదాలు కంటిన్యూ అవుతున్నాయి. అందరూ కలిసి పని చేసుకోవాలని పార్టీ అధినాయకత్వం చెప్పినా.. ఎవరి దారి వారిదే అన్నట్లుగా పరిస్థితి మారింది. టీడీపీ నుంచి వైసీపీకి దగ్గరైన వంశీకి ఏ విధంగానూ సహకరించేది లేదని యార్లగడ్డ- రామచంద్రరావు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు వర్గాలకు చెందిన కార్యకర్తలు తాడేపల్లిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో పలు మార్లు ఫిర్యాదులు చేసారు. కానీ, పార్టీ అధినాయకత్వం గన్నవరం నుంచి వచ్చే ఎన్నికల్లో వల్లభనేని వంశీ వైసీపీ అభ్యర్ధిగా ఉంటారని దాదాపుగా తేల్చి చెప్పింది.

వంశీకి సహకరించేదే లేదు
అయినా.. ఈ రెండు వర్గాలు మాత్రం ససేమిరా అంటున్నాయి. కొంత కాలంగా వంశీ రాజకీయంగా కొంత మౌనం పాటిస్తున్నారు. గతంలోనే సీఎం జగన్ స్వయంగా వంశీ - వెంకరావు మధ్య సఖ్యతగా ఉండాలనే సంకేతం ఇస్తూ అందరి సమక్షంలోనే ఇద్దరి చేతులు కలిపేలా స్వయంగా చొరవ తీసుకున్నారు. కానీ, ఇప్పటికీ నియోజకవర్గంలో మాత్రం పరిస్థితుల్లో మార్పు కనిపించటం లేదు.
తాజాగా.. గన్నవరంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రభల వేడుకల ఊరేగింపులో వివాదం చోటు చేసుకుంది. వల్లభనేని వంశీ కార్యాలయం వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. వంశీ వర్సెస్ వెంటకరావు వర్గీయులు ఘర్షణకు దిగారు.

విభేదాలు - ఘర్షణలు
తమ పైన యార్లగడ్డ వెంకటరావు వర్గీయులే దాడికి ప్రయత్నించారంటూ వంశీ వర్గం ఆరోపిస్తోంది. తమను రెచ్చగొట్టి..గొడవకు దిగారంటూ యార్లగడ్డ మద్దతు దారులు చెబుతున్నారు. వంశీ వైసీపీకి దగ్గరైన సమయం నుంచి ఈ రెండు వర్గాలు వ్యతిరేకంగానే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం జిల్లా పార్టీ సమన్వయకర్తగా వ్యవహరిసున్న మర్రి రాజశేఖర్ సైతం వీరితో మంతనాలు జరిపారు.
వంశీకి సహకరించాలని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా వంశీ ఉంటారని చెప్పుకొచ్చారు. కానీ, వంశీకి సహకారం అందించేందుకు ముందుకు రావటం లేదు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వంశీ తమ పైన అక్రమంగా కేసులు పెట్టి వేధించారని..ఇప్పుడు సహకారం అందించలేమని చెబుతున్నారు.

సీఎం జగన్ తేల్చేస్తారా
అటు టీడీపీ గన్నవరం పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. క్రిష్ణా జిల్లాలో గన్నవరం - గుడివాడ నియోజకవర్గాల్లో ఈ సారి వంశీ - కొడాలి నాని ఇద్దరినీ ఓడించాలనే లక్ష్యంతో కనిపిస్తోంది. అయితే, గన్నవరంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ పార్టీకి సమస్యగా మారుతున్నాయి. దీనిని టీడీపీ తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో..ఇప్పుడు నియోజకవర్గాల సమీక్షలు ప్రారంభించిన ముఖ్యమంత్రి గన్నవరం పైన సీఎం ఏం నిర్ణయం తీసుకోబోతున్నారనేది కీలకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications