నేను, చిరు ఒకరినొకరం పట్టుకుని ఏడ్చాం, కళ్లలో నీళ్లు ఆగలేదు: గంటా
హైదరాబాద్: ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానెల్లో ఆదివారం రాత్రి ప్రసారమయ్యే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవికీ తనకూ మధ్య గల అనుబంధాన్ని వివరించారు.
ప్రజారాజ్యం పార్టీని వీడి, తెలుగుదేశం పార్టీలో తాను చేరుతున్నప్పుడు అనుభవించిన భావోద్వేగంపై కూడా మాట్లాడారు. ప్రజారాజ్యం నుంచి టీడీపీకి వెళ్లిన విషయాన్ని చిరంజీవికి చెబుతున్నప్పుడు కళ్లలోంచి నీళ్లు ఆగలేదనీ, ఒకరినొకరం పట్టుకుని ఏడ్చామని గంటా చెప్పారు.
ఎక్కడ ఉన్నా నువ్వు బాగుండాలంటూ చిరంజీవి తనను ఉద్దేశించి వ్యాఖ్యానించారన్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ ఉంటే 2019 ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఏకపక్షమని ఆయన అభిప్రాయపడ్డారు. విభజన హామీలపై కేంద్రం మోసం చేయడం తగదన్నారు.

కేంద్రం నుంచి వైదొలగడం టీడీపీకి నిమిషంలో పని అనీ, అలా చేస్తే జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెంట ఉన్నా బీజేపీకే నష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబే రాష్ట్రానికి సరైన నేత అని భావించి టీడీపీలోకి వచ్చానని చెప్పారు. తాను టీడీపీలోకి వెళ్తున్న సంగతి చిరంజీవికి చెప్పాననీ, 'వైసీపీలోకి వెళ్లడం లేదు.. అదే నాకు సంతోషం' అని చిరంజీవి అన్నారని ఆయన వివరించారు.
చంద్రబాబు పెంచిన మొక్కను కాబట్టే మళ్లీ టీడీపీలోకి వచ్చానన్నారు. ప్రజారాజ్యం పార్టీ రాకముందు అసలు రాజకీయాలే వద్దనుకున్నానని గంటా తెలిపారు. నాగబాబు, పవన్ కల్యాణ్ ఎలాగో తనను కూడా ఓ తమ్ముడిలా చిరంజీవి చూశారని చెప్పారు. ఆదివారం రాత్రి ప్రసారమయ్యే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో గంటా శ్రీనివాస రావు పలు వ్యక్గిత విషయాలపై కూడా మాట్లాడారని ఆంధ్రజ్యోతి మీడయా రాసింది.












Click it and Unblock the Notifications