వైయస్ జగన్కు మరో షాక్: వైసీపీకి కీలక నేత గిరజాల రాజీనామా
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పారు. మాజీ శాసనసభ్యుడు, పార్లమెంటు సభ్యుడు గిరజాల వెంకటస్వామినాయుడు శుక్రవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి.
తూర్పుగోదావరి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పారు. మాజీ శాసనసభ్యుడు, పార్లమెంటు సభ్యుడు గిరజాల వెంకటస్వామినాయుడు శుక్రవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యత్వ పదవులకు రాజీనామా చేశారు.
రాజానగరం సమీపంలోని సూర్యారావుపేటలో స్థానిక దుర్గమ్మ ఆలయం వద్ద శుక్రవారం సాయంత్రం ఆయన మద్దతుదారులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో భారీగా ఆయన మద్దతుదారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను గతంలో తెలుగుదేశం పార్టీ తరపున కడియం నుంచి శాసనభ్యుడిగా, భారతీయ జనతా పార్టీ తరఫున రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యుడిగా పనిచేశానన్నారు.
ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో ప్రజలకు సేవలందించే వారిని పక్కన పెట్టే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో తాను శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేశానన్నారు.
తన శ్రేయోభిలాషుల కోరిక మేరకు 2019లో రాజానగరం నియోజకవర్గం నుంచి పోటీచేయడానికి నిర్ణయించానన్నారు. ఏ పార్టీలో చేరాలనేది తరువాత నిర్ణయించుకుని ప్రజలకు ప్రకటిస్తానన్నారు.