వారి కడుపుమంటకు మందు లేదు- జగన్: పాడైన రోడ్ల వివరాల కోసం యాప్
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటోన్న కీలక విమర్శల్లో ఒకటి- రోడ్ల మరమ్మతు. ఈ విషయంపై అటు వైఎస్ఆర్సీపీ అభిమానుల్లో కూడా అసంతృప్తి నెలకొంది. రోడ్ల గురించి పట్టించుకోవాలంటూ బాహటంగానే వ్యాఖ్యానించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. వర్షాకాలంలో రోడ్లు ధ్వంసం కావడం సహజమే అయినప్పటికీ- అది కాస్తా రాజకీయ రంగును పులుముకోవడం వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెట్టింది.
రోడ్లపై సమీక్ష..
వర్షాకాలం ముగిసిన వెంటనే ప్రభుత్వం రోడ్ల మరమ్మత్తు, నిర్మాణంపై దృష్టి పెట్టింది. యుద్ధ ప్రాతిపదికన వాటిని పూర్తి చేస్తోంది. ఈ పరిణామాల మధ్య వైఎస్ జగన్ ఇవ్వాళ రోడ్లపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటైన ఈ సమీక్షకు సంబంధిత శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రోడ్ల స్థితిగతులపై వైఎస్ జగన్ సమగ్రంగా సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారాయన.
ఎఫ్డీఆర్ టెక్నాలజీతో..
భారీ వాహనాలు తిరిగే సమయంలో రోడ్లు నేల స్వభావం దృష్ట్యా కుంగిపోతుంటాయని, దీన్ని నివారించడానికి పుల్ డెప్త్ రిక్లమేషన్ (ఎఫ్డీఆర్) టెక్నాలజీని వినియోగించాలని సూచించారు. ఎఫ్డీఆర్ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రోడ్లను బాగు చేసి నాడు- నేడు ద్వారా ప్రజల ముందు పెట్టాలని అన్నారు. రోడ్ల విషయంలో ప్రతిపక్ష పార్టీ, దానికి బాకా ఊదుతున్న కొన్ని మీడియా సంస్థలు నెగెటివ్ గా ప్రచారం చేస్తోన్నాయని, వారి కడుపుమంటకు మందు లేదు అని చెప్పారు.
ఏడేళ్ల పాటు
ఎఫ్డీఆర్ టెక్నాలజీతో రోడ్లను వేయడం వల్ల కనీసం ఏడేళ్లపాటు పాడవ్వకుండా ఉండేలా చూసుకోవాలని వైఎస్ జగన్ ఆదేశించారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకుని అందులో ప్రధానమైన రోడ్లన్నింటినీ కూడా పూర్తి చేయాలని అన్నారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు వంటి చోట్ల నేల స్వభావం రీత్యా రోడ్లు త్వరగా పాడైపోతున్నాయని, భారీ వాహనాలు తిరిగే సరికి కుంగిపోతున్నాయని అధికారులు తెలిపారు. ఇలాంటి చోట్ల ఎఫ్డీఆర్ టెక్నాలజీని వాడాలని జగన్ సూచించారు.
తొలిదశలో 1,000 కిలోమీటర్లు..
తొలి దశలో 1,000 కిలోమీటర్ల మేర ఎఫ్డీఆర్ టెక్నాలజీతో రోడ్ల మరమ్మతు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వచ్చే జూన్, జులై నాటికి ఈ పద్ధతిలో నిర్దేశించుకున్న మేరకు రోడ్లు వేయాలని అన్నారు. అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిల నిర్మాణాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పారు. వర్షాలు పడటం మొదలయ్యే నాటికి రోడ్ల మరమ్మతు పూర్తి చేయాలని, భారీ వాహనాలు తిరుగాడినప్పటికీ చెక్కు చెదరకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
కడప-బెంగళూరుపై
కడప, బెంగళూరు రైల్వే లైన్ నిర్మాణంపైనా దృష్టి పెట్టాలని జగన్ ఆదేశించారు. దీన్ని నిర్మాణానికి అయ్యే ఖర్చులో సగం వాటాను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని పేర్కొన్నారు. పూర్తయిన రోడ్లను ఆయా ప్రభుత్వ శాఖల వెబ్సైట్లలో కూడా పొందుపర్చాలని, కొన్ని మీడియా సంస్థలు దురుద్దేశంతో దుష్ప్రచారం చేస్తోన్నందున అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచాలని సూచించారు. పట్టణాలు, నగరాల్లో ఎప్పటికప్పుడు రోడ్లను మరమ్మతు చేయడానికి ఉద్దేశించిన ఏపీ సీఎం ఎంఎస్ యాప్ను సమీక్షా సమావేశంలో ప్రారంభించారు.
60 రోజుల్లో..
ఈ యాప్ ద్వారా స్థానిక ప్రజా ప్రతినిధులు, పౌరులు ఎవరైనా తమ పరిధిలో ఉన్న రోడ్ల గురించి ప్రభుత్వానికి ఫిర్యాదు చేయొచ్చని వైఎస్ జగన్ అన్నారు. జియో కోఆర్డినేట్స్తో పాటుగా ఫిర్యాదు నమోదు చేయాలని, దీనిపై కమాండ్ కంట్రోల్ రూం కూడా అందుబాటులోకి తీసుకుని రావాలని అన్నారు. పట్టణాలు, నగరాల్లో ఎక్కడైనా రోడ్లను రిపేరు చేయాలంటూ ఫిర్యాదు అందిన 60 రోజుల్లో బాగు చేయాలని జగన్ ఆదేశించారు.