'గోదావరి'పై హాట్హాట్: పట్టిసీమని ప్రశ్నించిన తెలంగాణ, టి ప్రాజెక్టులపై ఏపీ
హైదరాబాద్: గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం గురువారం నాడు హాట్ హాట్గా సాగింది. ఏపీ చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రం లేవనెత్తితో, గోదావరి జలాల పైన తెలంగాణ చేపట్టనున్న ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేవనెత్తింది.
పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో భాగమని ఏపీ వివరణ ఇచ్చింది. తాము సముద్రంలోకి వృథాగా పోతున్న నీటినే వాడుకుంటామని ఏపీ చెప్పింది. గోదావరి నదీ తీరంలోని ప్రాజెక్టులు అన్నీ ప్రాథమిక దశలోనే ఉన్నాయని, డిపిఆర్ పూర్తయ్యాక బోర్డు ముందు ఉంచుతామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
గోదావరి నదీ యాజమాన్య బోర్డు గురువారం హైదరాబాద్లోని జలసౌధలో సమావేశమైంది. గోదావరి బోర్డు పరిధి, విధి విధానాలు, గోదావరి పరిధిలో రెండు రాష్ట్రాలు చేపట్టే నిర్మాణాలు, ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం చేసుకున్న ఫిర్యాదులు కూడా బోర్డు సమావేశంలో చర్చకు వచ్చాయి.
తమ తమ కొత్త ప్రాజెక్టుల పైన ఏపీ, తెలంగాణలు తమ వాదనలకు కట్టుబడి ఉన్నాయి. వివిధ కారణాలతో కొన్ని నెలలుగా వాయిదా పడుతున్న ఈ సమావేశంలో ఎట్టకేలకు ఈ రోజు జరిగింది.
బోర్డు ఛైర్మన్ రామ్శరణ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జలవనరుల శాఖ కార్యదర్శులు ఆదిత్యనాథ్ దాస్, ఎస్కె జోషి, తెలంగాణ జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్, ఆ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్రావు తదితరులు పాల్గొన్నారు.