ఎన్నికల ఫలితాలవేళ ఏపీకి నరేంద్రమోడీ శుభవార్త
ఎన్నికల ఫలితాలు వెలువడి ఎన్డీయే కూటమి రాష్ట్రంలోను, దేశంలోను అధికారంలోకి వచ్చిన తరుణంలో ఏపీకి, తెలంగాణకు ఒక శుభవార్త. రైల్వేలకు, ఆధ్యాత్మిక పర్యటనలకు అత్యంత ప్రాధాన్యమిచ్చే ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి రెండు తెలుగు రాష్ట్రాలకు శుభవార్తను వినిపించారు. ఈనెల 22వ తేదీ నుంచి 30వ తేదీ వరకు "జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర" టూరిస్ట్ సర్క్యూట్ రైలు యాత్రను ప్రారంభించబోతున్నారు. ఐఆర్ సీటీసీ ఆధ్వర్యంలో జరిగే ఈ యాత్ర తిరువణ్ణామలై (అరుణాచలం)- రామేశ్వరం-మధురై-కన్యాకుమారి-త్రివేండ్రం-తిరుచ్చి-తంజావూరు వంటి దివ్య స్థలాలను సందర్శింపచేస్తుంది.
అన్ని ఖర్చులు కలుపుకొని..
తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి బయలుదేరి కాజీపేట, వరంగల్, ఖమ్మంతో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఈ భారత్ గౌరవ్ టూరిస్టు రైలు ఆగుతుంది. ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, డిన్నర్ సౌకర్యంతోపాటు ప్రయాణ భీమా సౌకర్యం కూడా ఉంది. సెకండ్ ఏసీలో ప్రయాణించాలనుకుంటే ఒక్కొక్కరికి రూ.28,450, థర్డ్ ఏసీకైతే రూ.21,900, స్లీపర్ లో ప్రయాణానికి రూ.14,250 అవుతుంది. ఆయా ప్రాంతాల్లో వాహన సౌకర్యం అవసరమైతే అది కూడా ఐఆర్ సీటీసీనే భరించనుంది.

ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది
దక్షిణ మధ్య రైల్వేలో "భారత్ గౌరవ్" రైళ్లు ప్రయాణికుల నుండి మంచి ఆదరణను సంపాదించుకున్నాయి. దక్షిణ మధ్య రైల్వే నడిపిన అన్ని రైళ్లకు మంచి స్పందన వచ్చింది. ఈ ఉత్సాహంతోనే ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్ సీటిసీ) సికింద్రాబాద్ నుండి మరో "జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర" ను ప్రారంభించింది. ప్రస్తుతం నడుపుతున్న పుణ్యక్షేత్రాల రైళ్ల నుంచి ఆదరణ లభించినకొద్దీ భవిష్యత్తులో మరిన్ని రైళ్లను నడిపించేందుకు ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయని అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న జ్యోతిర్లింగ క్షేత్రాల దర్శనం, చార్ ధామ్ యాత్ర... ఇలా విభిన్నమైన పేర్లతో యాత్రికులను తీర్థయాత్రలకు సిద్ధం చేస్తామంటున్నారు.












Click it and Unblock the Notifications