జగన్ డిమాండ్కు తలొగ్గిన ప్రభుత్వం: సిబిఐ చేతికి తుని రైలు దగ్దం కేసు
హైదరాబాద్: కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగగడ దీక్ష నేపథ్యంలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్కు ప్రభుత్వం అంగీకరించింది. తుని రైలు దగ్ధం కేసును సిబిఐకి అప్పగించడానికి ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని శుక్రవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు.
సిబిఐ విచారణ జరిపించాలని వైయస్ జగన్ డిమాండ్ చేస్తున్నారని, ముద్రగడ అంగీకరిస్తే సిబిఐకి కేసును అప్పగించడానికి తాము సిద్దంగా ఉన్నామని ఆనయ చెప్పారు. సిఐడి విచారణపై ముద్రగడ, జగన్ విమర్సలు చేస్తున్నారని, సిబిఐకి అప్పగించాలని జగన్ పదే పదే డిమాండ్ చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు.
సిఐడి విచారణ బాగానే జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. కాపులను ఉద్ధరించినట్లుగా జగన్ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంచి ఉద్దేశంతోనే ఉన్నారని ఆయన చెప్పారు. ఆత్మహత్య చేసుకుంటానని ముద్రగడ అన్నప్పుడు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. తుని ఘటనలో అరెస్టు చేయడానికి వీలు కాదని తాము చెబుతున్నామని, ముద్రగడ కోరితే సిబిఐకి కేసును అప్పగిస్తామని ఆయన చెప్పారు.
తుని విధ్వంసంలో వైసిపి నేతల ప్రమేయం ఉందని, జగన్ పాత్ర ఉందని మంత్రి నారాయణ అన్నారు. అరెస్టు చేసినవారిని వదిలేయాలని ముద్రగడ అడుగుతున్నారని, సిఐడి విచారణపై నమ్మకం లేనట్లుగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. అందువల్ల ముద్రగడ అంగీకరిస్తే కేసును సిబిఐకి అప్పగిస్తామని చెప్పారు. సిబిఐ విచారణకు అప్పగిస్తే ముద్రగడ దీక్ష విరమించాల్సి ఉంటుందని అన్నారు.
రైలు దహనం చేయాలనే ఆలోచన తుని సభకు వచ్చిన కార్యకర్తలకు వచ్చి ఉండదని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు.