కెసిఆర్-బాబును కలిపిన సంతోషం: గవర్నర్, అమరావతి వేడుకపై..
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు (ఆంధ్రప్రదేశ్), కల్వకుంట్ల చంద్రశేఖర రావు (తెలంగాణ)ల పైన ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ బుధవారం నాడు ప్రశంసలు కురిపించారు. ఇద్దరు ముఖ్యమంత్రులకు మంచి విజన్ ఉందని చెప్పారు.
రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా మంచి సమర్థులు అని చెప్పారు. తాను రెండు తెలుగు రాష్ట్రాలకు తండ్రిలాంటివాడినేని చెప్పారు. తనకు రెండు రాష్ట్రాలూ సమానమేనని చెప్పారు.
ఇరువురు సీఎంల మధ్య సమోధ్య కుదర్చడంలో తాను సఫలీకృతుడనయ్యానని చెప్పారు. ఇద్దరు సీఎంలు కలవడం శుభ పరిణామమన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు ఏర్పడినప్పుడు ఇద్దరు సీఎంలు సామరస్యపూర్వకంగా వాటిని పరిష్కరించుకోవాలని ఆకాంక్షించారు.
తన హయాంలో ఏపీ రాజధాని అమరావతికి శంకుస్థాపన జరగడం శుభపరిణామం అన్నారు. అమరావతిలో ఇద్దరు సిఎంలు కలవడం కూడా అభినందనీయమన్నారు. అందరి సమక్షంలో జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గవర్నర్ నేడు 69వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఆయనకు పలువురు రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.