అంతర్వేది రథం దగ్ధంపై సీబీఐతో విచారణ, శ్రీనివాసానంద సరస్వతి స్వామి డిమాండ్..
అంతర్వేది రథం దగ్ధం ఘటన ఇష్యూ రగులుతూనే ఉంది. ముఖ్యంగా హిందూ సంస్థలు ప్రభుత్వంపై ముప్పేట దాడికి దిగుతున్నాయి. ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామి డిమాండ్ చేశారు. అంతర్వేదిలో దగ్ధమయ్యింది.. స్వామివారి రథం కాదని ఐదుకోట్ల ప్రజల మనోరథాలని అన్నారు.
ఆలయాలను పరిరక్షించలేని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి పదవీకి అర్హుడు కాదన్నారు. వెంటనే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతర్వేదిలో రథం దగ్ధం కావడం చాలా బాధాకరమన్నారు. ఆ రథాలు స్వామివారితో 62 ఏళ్ల అనుబంధం అని గుర్తుచేశారు. లక్షలాది మంది భక్తులు తరించే రథాన్ని.. దగ్ధం జరగడం ఆవేదనకు గురిచేస్తుందని తెలిపారు.
Recommended Video
సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో హిందువులపై దాడులు జరుగుతున్నాయని స్వామి విమర్శించారు. రాష్ట్రంలో స్వేచ్చను హరిస్తున్నారని మండిపడ్డారు. కనీసం మాట్లాడే అవకాశం కూడా లేదని దుయ్యబట్టారు. ఆలయాలపై ఎందుకు దాడులు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ప్రభుత్వం వేసే కమిటీలపై తమకు నమ్మకం లేదన్నారు. ఘటనపై విచారణ కోసం సీబీఐతో విచారణ జరిపించాలని శ్రీనివాసానంద సరస్వతి స్వామి డిమాండ్ చేశారు.