ఏపీలో క్రమంగా తగ్గుతున్న కరోనా- 24 గంటల్లో 8 వేల కేసులు- తగ్గిన మృతులు..
ఏపీలో కరోనా క్రమంగా అదుపులోకి వస్తున్నట్లు ప్రభుత్వం విడుదల చేస్తున్న తాజా హెల్త్ బులిటెన్లు స్పష్టం చేస్తున్నాయి. అన్లాక్ ప్రకటన తర్వాత ఏపీలో ప్రస్తుతం సానుకూల పరిస్ధితులు కనిపిస్తున్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వారం రోజుల క్రితం వరకూ పది వేలకు పైగా నమోదైన కేసుల సంఖ్య ఇప్పుడు క్రమంగా తగ్గుతోంది. తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లోనూ గత 24 గంటల్లో కేవలం 8 వేల కొత్త కేసులు మాత్రమే నమోదు కావడం ప్రభుత్వంతో పాటు ప్రజలకు ఊరట కలిగించే అంశం. అలాగే మరణాల సంఖ్య కూడా క్రమేపీ తగ్గుతోంది. మరికొన్ని రోజులు ఇదే పరిస్ధితి కొనసాగితే కేసుల సంఖ్య భారీగా తగ్గే అవకాశముందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.
కేంద్రం గుడ్న్యూస్- వచ్చే ఏడాది ఆరంభంలో కరోనా వ్యాక్సిన్- రాజ్యసభలో ప్రకటన...
అదుపులోకి వస్తున్న కరోనా...
ఏపీలో కరోనా ప్రభావం అంతకంతకూ తగ్గుతోంది.. ప్రభుత్వం అంచనా వేసినట్లుగానే సెప్టెంబర్ నెలలో పరిస్దితులు క్రమంగా అదుపులోకి వస్తున్నట్లు తాజాగా విడుదల చేస్తున్న హెల్త్ బులిటెన్లు స్పష్టం చేస్తున్నాయి. వారం, పది రోజుల క్రితం రాష్ట్రంలో పది వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతుండగా.. తాజాగా ఈ సంఖ్య 8 వేలకు తగ్గిపోయింది. కొన్ని రోజులుగా దాదాపు 8 వేల కేసులు నమోదవుతుండటం ప్రభుత్వంతో పాటు ప్రజలకూ ఊరటనిస్తోంది. అదీ అన్లాక్ ప్రక్రియ కొనసాగుతున్ననేపథ్యంలో కొత్త కేసుల తగ్గుదల సానుకూల అంశమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గోదావరి జిల్లాల్లో మినహా మిగిలిన జిల్లాల్లో పరిస్ధితులు క్రమంగా నియంత్రణలోకి వస్తున్నట్లు తాజా బులిటెన్లలో గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
గోదావరి జిల్లాల్లోనే ఎక్కువ కేసులు..
రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనంతగా రోజుకు కనీసం వెయ్యి కేసులకు తగ్గకుండా గోదావరి జిల్లాల్లో నమోదవుతుండటం మాత్రం అధికారులను కలవరపెడుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో అయితే కచ్చితంగా లెక్కించినట్లుగా రోజువారీ కేసులు 1400కు కాస్త అటు ఇటుగా నమోదవుతుండగా.. పశ్చిమగోదావరిలో సైతం రోజూ దాదాపు వెయ్యి కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఇప్పటిదాకా భారీగా పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల్లోనూ గోదావరి జిల్లాలు దూసుకుపోతున్నాయి. ఇవాళ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లోనూ రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో కలిపి 8 వేల కేసులు నమోదైతే.. ఇందులో గోదావరి రెండు జిల్లాల్లోనే 2400 కేసులున్నాయి. మిగిలిన 11 జిలాల్లో కలిపి 5600 కేసులు మాత్రమే ఉన్నాయి. అంటే సగటున జిల్లాకు 500 కేసులు మాత్రమే.
తగ్గుతున్న మృతుల సంఖ్య...
వారం క్రితం వరకూ రోజూ ఏపీలో దాదాపు 100 మంది కరోనా కారణంగా చనిపోయేవారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య కూడా భారీగా తగ్గింది. ఇప్పుడు 60 నుంచి 70 మధ్య ఉంటోంది. ఇది మరో సానుకూల అంశంగా చెప్పవచ్చు. ఇవాళ ప్రకటించిన హెల్త్ బులిటెన్లోనూ గరిష్టంగా కడపలో 8 మంది చనిపోయారు. కనిష్టంగా కర్నూల్లో రెండు మరణాలు చోటు చేసుకున్నాయి. కరోనాపై ప్రజల్లో పెరిగిన అవగాహన, సీరియస్ కేసులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం వంటి కారణాలతో మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతోందని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. ఈ సంఖ్య రాబోయే రోజుల్లో మరింత తగ్గించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
Recommended Video