వైసీపీ అయినా.. టీడీపీ అయినా 40 ఏళ్లుగా అక్కడ ముస్లిం అభ్యర్థిదే విజయం
Guntur East Assembly round up 2024: గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాట్రిక్పై కన్నేసింది. ఇప్పటికి వరుసగా రెండుసార్లు ఇక్కడ విజయదుందుభి మోగించింది. ముచ్చటగా మూడోసారి పాగా వేయాలనే పట్టుదలతో ఉంది. దీన్ని తెలుగుదేశం పార్టీ ఎలా అడ్డుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది.
గుంటూరు ఈస్ట్కు ఓ ప్రత్యేకత ఉంది. రాష్ట్రంలో 1983 నుంచి పార్టీ ఏదయినా గానీ ముస్లిం అభ్యర్థులు మాత్రమే ఎన్నికవుతున్న ఏకైక అసెంబ్లీ నియోజకవర్గం ఇదే. గుంటూరు లోక్సభ పరిధిలోకి వచ్చే జనరల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇది. గుంటూరు సిటీ, మండలంలోని కొన్ని ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయి. 2,29,830 మంది ఓటర్లు ఉంటారు.

సంఖ్యాపరంగా ముస్లింలు అధికంగా ఉంటారు. కాపులు, వైశ్యులు, ఎస్సీ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటారు. అభ్యర్థుల గెలుపోటముల్లో ముస్లిం ఓటుబ్యాంకే కీలక పాత్ర పోషిస్తుంటుంది. 1952 నుంచి 2019 వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 1952లో కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ అభ్యర్ధిగా నడింపల్లి వెంకట లక్ష్మీనరసింహారావు విజయం సాధించారు.
1955లో కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ మున్సిపల్ ఛైర్మన్ తెల్లాకుల జాలయ్య, 1962లో సీపీకి చెందిన కనపర్తి నాగయ్య గెలిచారు. 1967లో శనక్కాయల అంకమ్మ, 1972లో విజయ రామానుజం, 1978లో లింగంశెట్టి ఈశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్ధులుగా విజయం సాదించారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత తొమ్మిది సార్లు ఎన్నికలు జరగ్గా.. నాలుగు సార్లు కాంగ్రెస్ పాగా వేసింది. టీడీపీ మూడుసార్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు గెలిచాయి. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన షేక్ మస్తాన్ వలి..ప్రజా రాజ్యం పార్టీకి చెందిన షేక్ షౌకత్పై 9,012 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆ ఎన్నికల్లో టీడీపీది మూడోస్థానం. మాజీ మంత్రి లాల్ జాన్ భాషా తమ్ముడు జియావుద్దీన్ మూడో స్థానంలో నిలిచారా ఎన్నికల్లో.
2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థి షేక్ ముస్తఫా చేతిలో మద్దాలి గిరిధర్ రావు 3,151 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019లో కూడా ముస్తఫా విజయం సాధించారు. టీడీపీ అభ్యర్ధి మహ్మద్ నజీర్ను 22,091 ఓట్ల తేడాతో ఓడించారు.
ఈ ఎన్నికల్లో ముస్తఫా పోటీ చేయట్లేదు. ఆయన కుమార్తె నూరి ఫాతిమాను రంగంలో దించింది వైఎస్ఆర్సీపీ. టీడీపీ తరఫున మరోసారి మహ్మద్ నజీర్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు. కాంగ్రెస్ తరఫున మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలి రేసులో నిలిచారు. దీనితో ఇక్కడ ముక్కోణపు పోటీ ఏర్పడినట్టయింది.












Click it and Unblock the Notifications