జగన్కు ప్రజా వేదిక- చంద్రబాబుకు..?- మైనస్ పాయింట్?
GV Reddy resignation: ఏపీ ఫైబర్నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా వ్యవహారం తెలుగుదేశం పార్టీలో కాక పుట్టించింది. సొంత పార్టీలోనే దీనిపై వ్యతిరేకత ఎదురవుతోంది. క్యాడర్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా జీవీ రెడ్డికి అండగా నిలిచినట్టే కనిపిస్తోంది- అందులో పోస్టింగ్స్ను బట్టి చూస్తే.
సోమవారం సాయంత్రం ఏపీ ఫైబర్నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి హోదాకు గుడ్బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకొంటోన్నట్లు ప్రకటించారు. ఏ పార్టీలోనూ చేరదలచుకోలేదనీ స్పష్టం చేశారు.

ఆయన రాజీనామా- తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశమైంది. టీడీపీ కిందిస్థాయి క్యాడర్ దిగ్భ్రాంతికి గురైంది. ఆయనకు మద్దతుగా నిలిచింది. ఒక ఐఏఎస్ అధికారి కోసం తెలుగుదేశం పార్టీని ప్రాణప్రదంగా అభిమానించిన జీవీ రెడ్డి వంటి ఆత్మాభిమానం కలిగిన నాయకుణ్ణి వదులుకోవడం అత్యంత దురదృష్టకరం అంటూ ఐటీడీపీ విభాగం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తోన్నారు.
పార్టీ కోసం జీవీ రెడ్డి అహర్నిశలు కష్టపడ్డారని గుర్తు చేస్తోన్నారు. ప్రభుత్వం మారినప్పటికీ 2019 నుండి 2024 మధ్య కాలంలో పని చేసిన కొంతరు అధికారుల తీరు మాత్రం మారలేదంటూ మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో ప్రతి ఐటీడీపీ సభ్యుడు కూడా కింద స్థాయి వరకు కష్టించి పని చేశారని, వారికి తగిన గుర్తింపు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉదని తేల్చి చెబుతున్నారు.
పార్టీ అధిష్టానం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, లేకపోతే తీవ్ర నష్టం జరుగుతుందనీ అంటున్నారు. తన రాజీనామా నిర్ణయాన్ని జీవీ రెడ్డి పునరాలోచించుకోవాలనీ కోరుతున్నారు. ప్రజా వేదిక కూల్చివేత వ్యవహారం వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఎలాంటి నష్టాన్ని తీసుకొచ్చిందో.. టీడీపీ సర్కార్కు జీవీ రెడ్డి రాజీనామా అంశం అలాంటి మైనస్ పాయింట్ అవుతుందంటూ అభిప్రాయపడుతున్నారు.
జీవీ రెడ్డి రాజీనామా తరువాత ఏపీ ఫైబర్నెట్ మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ కుమార్ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని సూచించింది. ఆయనను బదిలీ చేయాలంటూ జీవీ రెడ్డి చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడమే రాజీనామాకు దారి తీసినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications