హనుమాన్ జయంతి వేడుకలకు సిద్ధమైన తిరుమల, యాదాద్రి!
హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ప్రముఖ ఆంజనేయ స్వామి ఆలయాలలో మాత్రమే కాకుండా, రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలలో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసం బహుళ దశమి నాడు హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహిస్తారు. ఈ సంవత్సరం మే 22వ తేదీన హనుమాన్ జయంతిని జరుపుకోబోతున్నాం. ఈ క్రమంలో మే 22వ తేదీన టీటీడీ అత్యంత వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహించనుంది.
తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలు ఇక్కడే
తిరుమల శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారికి, అలాగే కాలినడక బాటలో ఏడవ మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ జయంతి పండుగ నాడు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు .తిరుమలలోని జపాలి తీర్థంలో కూడా ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.

టీటీడీ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు
టిటిడి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ వేడుకలలో సాంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం టిటిడి తరఫున శ్రీ జపాలి ఆంజనేయ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇక అదే రోజు మొదటి ఘాట్ రోడ్ లో ఉన్న ఏడవ మైలు వద్ద గల శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహానికి సాయంత్రం మూడు గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
యాదగిరిగుట్టలోనూ హనుమాన్ జయంతి వేడుకలు
ఇక హనుమాన్ జయంతి వేడుకలు సందర్భంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు టిటిడి భక్తులు మరియు స్థానికుల సౌకర్యం కోసం ఉచిత రవాణా సౌకర్యాన్ని తిరుమల నుండి ఏడవ మైలుకు ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయానికి, తిరిగి తిరుమలకు చేరుకోవడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలోని యాదగిరిగుట్ట లోను, హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
హనుమాన్ జయంతికి యాదాద్రిలో వేడుకలు ఇలా
యాదగిరిగుట్ట ఆలయానికి క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి కావడంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈనెల 22వ తేదీన కొండపైన విష్ణు పుష్కరిణి పక్కన ఉన్న హనుమాన్ ఆలయంలో జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. ఈ క్రమంలో రేపు ఉదయం 9 గంటలకు అష్టోత్తర శత మన్య సూక్త పారాయణ లతో అభిషేకం, లక్ష తమలపాకులతో సహస్రనామార్చన వంటి ప్రత్యేక పూజలు చేయనున్నారు.












Click it and Unblock the Notifications