అమ్మాయికి వేధింపులు: 4గురు యువకుల అరెస్ట్
అనంతపురం: ఓ విద్యార్థినిపై వేధింపులకు పాల్పడి.. ఆమె ఆత్మహత్య యత్నం చేసుకునేందుకు కారణమైన నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా ధర్మవరంలో ప్రేమించకపోతే చంపేస్తానంటూ ఓ యువకుడు విద్యార్థినిని తరచూ వేధింపులకు గురిచేయడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది.
ఈ నేపథ్యంలో ఆమె గత శుక్రవారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి కొంత నిలకడగా ఉంది.
ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తను స్కూలుకు వెళ్తున్న సమయంలో ఆ యువకుడు తరచూ వేధింపులకు పాల్పడేవాడని బాధితురాలి పోలీసులకు తెలిపింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. బుధవారం బాధితురాలిపై వేధింపులకు పాల్పడిన నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన యువకులు మైనర్లు అని పోలీసులు తెలిపారు.

నగల దుకాణంలో పట్టపగలు చోరీకి యత్నం
అనంతపురం జిల్లాలో ఓ బంగారం దుకాణంలో పట్టపగలే దొంగతనానికి ప్రయత్నించి ముగ్గురు దొంగలు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఉరవకొండ పట్టణంలోని కెఆర్ జువెలర్స్లో నగలు కొనేందుకంటూ ముగ్గురు వ్యక్తులు వచ్చారు. మోడల్స్ ఎక్కువగా చూపించాలని అడిగారు.
దుకాణం సిబ్బంది నగలు చూపించే పని ఉండగా.. దుండగులు చేతివాటం ప్రదర్శించారు. నగలు కాజేస్తున్న దృశ్యాల్నీ సిసి కెమెరాలో గమనించిన సిబ్బంది దొంగలను పట్టుకుని దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. నిందితులు ముగ్గురూ అంతరాష్ట్ర దొంగలని పోలీసులు గుర్తించారు.












Click it and Unblock the Notifications