మీరు కట్టొచ్చా: హరీష్, భారత్-పాక్ కాదు, వారిలా కొట్టుకోవద్దు: గాలి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు కడితే తప్పు లేదు కానీ, మేం కడితే తప్పా అని తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం నాడు ప్రశ్నించారు. ప్రాజెక్టుల వివరాలను అపెక్స్ కమిటీ ముందు ఉంచుతామని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ నేతలు ఇంకా అడ్డుతగులుతూనే ఉన్నారన్నారు. డిండి, పాలమూరు ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులంటూ ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రం ముందు మొండిగా వాదిస్తున్నారన్నారు. ఆ ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలోనే జీవోలు జారీ అయ్యాయన్నారు.
భారత్- పాకిస్తాన్ కాదు: గాలి
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు భారత, పాకిస్తాన్ కావని, అరవై ఏళ్ళు కలిసే ఉన్నామని, కర్ణాటక, తమిళనాడు మాదిరిగా కొట్టుకొనే పరిస్ధితులు తెచ్చుకోవద్దని, నీళ్లు అందరికీ కావాలని, ఉన్న నీటిని చట్ట ప్రకారం పంచుకుందామని, పిడివాదంతో కాకుండా హేతుబద్ధంగా ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో వెళ్దామని ఏపీ టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు మంగళవారం తెలంగాణ సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు.
కృష్ణా నదిలో ఉమ్మడి రాష్ట్రానికి ఏడాదికి 800కుపైగా టీఎంసీల నీరు రావలసి ఉంటే నిరుడు కేవలం 73 టీఎంసీలు, ఈ ఏడాది 220 టీఎంసీలు వచ్చాయన్నారు. ఉన్న ప్రాజెక్టులకే నీరుచాలక అవస్థలు పడుతుంటే తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదిపై పాలమూరు-రంగారెడ్డి, డిండి పేరుతో రెండు కొత్త ప్రాజెక్టులు ప్రతిపాదించిందని, ఈ రెంటికీ కలిపి 180 టీఎంసీల నీరు కావాలన్నారు.
ఈ రెండూ పాత ప్రాజెక్టులని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వాదన తప్పన్నారు. వాటికి గతంలో ఏ అనుమతులూ రాలేదని, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులేవో విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారని చెప్పారు.
తెలంగాణలో కల్వకుర్తి, నెట్టెంపాడు, శ్రీశైలం ఎడమ కాల్వ ప్రాజెక్టులు, ఏపీలో హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలిగొండ, తెలుగుగంగ పెండింగ్ ప్రాజెక్టులుగా రాశారని, ఈ జాబితాలో పాలమూరు, డిండి లేవని, విభజన చట్టాన్ని ఏపీ నాయకులు తయారు చేయలేదన్నారు. తమ కనుసన్నల్లోనే విభజన చట్టం తయారైందని కేసీఆర్ సహా తెలంగాణ నేతలంతా అనేకసార్లు ప్రకటించారని, ఈ రెండూ ఆనాడు లేవు కాబట్టే అందులో పెట్టలేదన్నారు.