గిల్లికజ్జాలు, మాపై తెలంగాణ సర్కార్ పెత్తనమేమిటి: చంద్రబాబు
విజయవాడ: తెలంగాణ ప్రభుత్వం ప్రతి విషయంలోనూ గిల్లికజ్జాలకు దిగుతోందని, సమస్యల పరిష్కారానికి సహకరించడం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. తమ మంత్రులపై, అధికారులపై తెలంగాణ పెత్తనమేమిటని ఆయన అడిగారు.
ఏడాది పూర్తయింది కాబట్టే తాము సెక్షన్ 8 గురించి అడుగుతున్నామని ఆయన అన్నారు. విద్యుత్తు ఉద్యోగులను ఉన్న ఫళంగా తొలిగిస్తే ఎలా అని ఆయన అడిగారు. కేంద్రం, గవర్నర్ జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. ఉమ్మడి రాజధానిలో గవర్నర్కే పూర్తి అధికారాలుంటాయని ఆయన అననారు.
వారానికి నాలుగు రోజులు తాను విజయవాడలోనే ఉంటానని, కార్యాలయం పూర్తి కాకున్నా బస్సులోనే ఉండి కార్యకలాపాలు సాగిస్తానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శనివారం టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో అన్ని శాఖల కార్యాలయాలను విజయవాడకు తరలిస్తామని ఆయన చెప్పారు.

ఎన్ని ఇబ్బందులు వచ్చినా అనుకున్న పనులు చేయగలిగామన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై నేతలకు అవగాహన ఉండాలని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేశామని చంద్రబాబు అన్నారు. రూ.5 వేల కోట్లతో ఎస్సీ సబ్ప్లాన్, రూ.2 వేల కోట్లతో ఎస్టీ సబ్ప్లాన్, రూ.6 వేల కోట్లతో బీసీ సబ్ప్లాన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు.
సమస్యలపై కూర్చుని మాట్లాడుకుందామంటే తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడం లేదని సీఎం చంద్రబాబు విమర్శించారు. ఇద్దరం కలిసి కూర్చుంటే ఆమోదయోగ్యమైన పరిష్కారం వస్తుందని అభిప్రాయపడ్డారు. సెక్షన్-8పై తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యను గవర్నర్కు చెప్పినా పరిష్కారం కాలేదన్నారు. 9,10 షెడ్యూల్ సంస్థలపై తెలంగాణ ప్రభుత్వ తీరు సరికాదని ముఖ్యమంత్రి తెలిపారు.
ఎన్నికల ముందు కావాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ను బయటికి తీసుకువచ్చారన్నారు. వైసీపీని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని ఆగ్రహించారు. టీడీపీని దెబ్బతీసేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్, వైసీపీ కుట్ర చేస్తున్నాయని ఆయన విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications