Rains in Andhra Pradesh: అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్-సహాయక చర్యల్లోకి వార్డు,సచివాలయ ఉద్యోగులు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం(జులై 22) భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించారు. ప్రతీ మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్లు అందుబాటులో ఉండాలని... ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని.. వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి బొత్స అధికారులను ఆదేశించారు. అవసరమైతే సహాయక చర్యల్లో వార్డు,సచివాలయ ఉద్యోగులను కూడా భాగస్వాములను చేయాలని కమిషనర్లను ఆదేశించారు. అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడ ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
అంతకుముందు,జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించారు.ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్లను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్దితుల్ని అడిగి తెలుసుకున్నారు. మరో రెండు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీరు,విద్యుత్ సప్లైకి అంతరాయం తలెత్తకుండా చూసుకోవాలన్నారు.
వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరి ముంపుకు గురయ్యే అవకాశం ఉండటంతో... ముందుగానే ఆ ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలన్నారు. అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని ప్రాజెక్టుల్లో నీటి మట్టాల్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కాగా,బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం(జులై 21) నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రోడ్ల పైకి వరద నీరు చేరి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.