పేర్నినానికి హెరిటేజ్ హెచ్చరిక-ఎర్రచందనం వ్యాఖ్యలపై వివరణ- వారం రోజుల్లో వెనక్కి తగ్గకపోతే
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగిపోతున్న పోరులో మాటలు హద్దులు దాటుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబును విమర్శించే క్రమంలో ఆయన కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ ను వైసీపీ ఎప్పటినుంచో టార్గెట్ చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఏపీ సమాచారశాఖ మంత్రి పేర్నినాని హెరిటేజ్ ఫుడ్స్ ద్వారా జపాన్ కు కృష్ణపట్నం పోర్టు ద్వారా ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతన్నట్లు ఆరోపణలు చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన హెరిటేజ్ యాజమాన్యం ఆయనకు హెచ్చరికలు పంపింది.
వైసీపీ వర్సెస్ హెరిటేజ్ ఫుడ్స్
ఏపీలో వైసీపీ నేతలు చంద్రబాబును టార్గెట్ చేసే క్రమంలో ఆయన కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ ను పదే పదే తెరపైకి తెస్తుంటారు. ఇదే క్రమంలో హెరిటేజ్ నుంచి మజ్జిగ, పాలు తీసుకుని సరఫరా చేస్తున్నారని గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ పదే పదే ఆరోపణలు చేశారు. ఇప్పుడు తాజాగా హెరిటేజ్ కు చెందిన వాహనాల్లో జపాన్ కు ఎర్రచందనం ఎగుమతి జరుగుతుందని కూడా ఆరోపించారు. దీంతో ఇప్పుడు వైసీపీ వర్సెస్ హెరిటేజ్ ఫుడ్స్ పోరు కాస్తా కొత్త మలుపు తీసుకుంటోంది.
హెరిటేజ్ పై పేర్నినాని వ్యాఖ్యలు
హెరిటేజ్ ఫుడ్స్ కు చెందిన వాహనాల్లో కృష్ణపట్నం పోర్టు ద్వారా జపాన్ కు ఎర్రచందనం ఎగుమతి చేస్తున్నారంటూ తాజాగా ఏపీ సమాచారశాఖ మంత్రి పేర్నినాని సంచలన ఆరోపణలు చేశారు. సోషల్ మీడియాలో చేసిన ఈ ఆరోపణలు క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. ఇప్పటివరకూ హెరిటేజ్ ఫుడ్స్ ఉత్పత్తులపై, వాటిని మార్కెటింగ్ చేసుకుంటున్న తీరుపైనే ఆరోపణలు చేసిన వైసీపీ మంత్రి.. ఇప్పుడు ఏకంగా ఎర్రచందనం స్మగ్లింగ్ అంటూ కొత్త ఆరోపణ చేయడంతో ఈ వ్యవహారంపై చర్చ మొదలైంది. ఇది కాస్తా చినికిచినికి గాలివానగా మారిపోతోంది.
పేర్నినానికి హెరిటేజ్ హెచ్చరిక
హెరిటేజ్ ఫుడ్స్ జపాన్ కు తమ వాహనాల్లో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తోందంటూ సోషల్ మీడియాలో మంత్రి పేర్నినాని చేసిన ఆరోపణల్ని సంస్ధ సీరియస్ గా తీసుకుంది. దీంతో మంత్రికి ఇవాళ హెచ్చరికలు పంపింది. ఇందులో పలు కీలక అంశాల్ని హెరిటేజ్ ప్రస్తావించింది. ఈ నెల 22న తేదీన మంత్రి పేర్నినాని తమ వాహనాల్లో కృష్ణపట్నం పోర్టు ద్వారా జపాన్ కు ఎర్రచందనం అక్రమంగా రవాణా అవుతున్నట్లు చేసిన ఆరోపణలు నిరాధారమని హెరిటేజ్ పేర్కొంది. అంతే కాదు తమపై పేర్నినాని చేసిన ప్రతీ ఆరోపణకూ ఈ వివరణలో సమాధానం కూడా ఇచ్చింది.
అసలేం జరిగిందంటే
2017 జూలైలో చంద్రబాబు సీఎంగా ఉండగా.. హెరిటేజ్ వాహనాల్లో కృష్ణపట్నం పోర్టు ద్వారా జపాన్ కు అక్రమంగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారని సాక్షి పత్రికలో వార్త వచ్చింది. దీనిపై అప్పట్లోనే స్పందించిన హెరిటేజ్ ఫుడ్స్ జూలై 5న వివరణ కూడా ఇచ్చింది. ఈ వివరణను మిగతా పత్రికలు ప్రచురించినా సాక్షి మాత్రం పాక్షికంగానే ఇచ్చింది. ఆ తర్వాత రోజే అంటే జూలై 6న తమ వివరణ పూర్తిగా ప్రచురించలేదని, అదీ ఆరోపణలు వచ్చిన ప్రాంతంలో పత్రికలో రాలేదని గుర్తు చేసింది. అయినా సాక్షి పట్టించుకోకపోవడంతో 2017 అక్టోబర్ 23న సాక్షిపై హెరిటేజ్ ఫుడ్స్ పరువునష్టం దావా వేసింది. ఎర్రచందనం స్మగ్లర్లు ఉద్దేశపూర్వకంగా హెరిటేజ్ ఫుడ్స్ స్టిక్కర్లు వేసుకుని అక్రమ రవాణా చేస్తున్నట్లు అప్పట్లో పోలీసులు కూడా తేల్చారు.
మళ్లీ తెరపైకి తెచ్చిన పేర్నినాని
గతంలో జరిగిన ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుతో పాటు హెరిటేజ్ వాహనాలను దీనికి వాడుకున్నారంటూ సాక్షిలో వచ్చిన కథనంపై దాఖలైన పరువునష్టం కేసు రెండూ కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నాయి. అదే సమయంలో ఈ నెల 22న యూట్యూబ్, ట్విట్టర్ లో మంత్రి పేర్నినాని మరోసారి ఈ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి అవే ఆరోపణలు చేశారని హెరిటేజ్ ఫుడ్స్ వివరణలో తెలిపింది.ఇందులో 29 ఏళ్లుగా హెరిటేజ్ ఫుడ్స్ పాలతో పాటు పాల ఉత్పత్తుల రంగంలో ఎన్నో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన సంస్ధ అని, తమకు పాలను సరఫరా చేస్తున్న రైతుల ప్రయోజనాల కోసం ఎంతో చేస్తున్నట్లు తెలిపింది. హెరిటేడ్ ఫుడ్స్ ప్రభుత్వం నుంచి ఎప్పుడూ భూములు కానీ, ఇతర ప్రయోజనాలు కానీ తీసుకోలేదని, సొంత కష్టంపై ఎదిగిన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అని తెలిపింది.
వారంలో వెనక్కి తగ్గకపోతే పరువునష్టం దావా
హెరిటేజ్ సంస్ధపై మంత్రి చేసిన ఆరోపణలు తమ పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయని, అదీ కోర్టులో కేసులు నడుస్తున్న నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని హెరిటేజ్ తెలిపింది. కాబట్టి మంత్రి పేర్నినాని తాను చేసిన ఆరోపణల్ని వారం రోజుల్లో బహిరంగంగా వెనక్కితీసుకోకపోతే పరువునష్టం దావా వేయాల్సి ఉంటుందని హెరిటేజ్ ఫుడ్స్ మంత్రిని హెచ్చరించింది. దీంతో ఇప్పుడు మంత్రి పేర్నినాని వీటిపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.