హోదా: అద్వానీని లాగి, బిజెపిపై శివాజీ తీవ్ర వ్యాఖ్య, మోడీకి కొణతాల లేఖ
అనంతపురం: భారతీయ జనతా పార్టీ ఈ స్థాయికి ఎదగడానికి కారణమైన అద్వానీనే ఆ పార్టీ పక్కన పెట్టిందని, అలాంటప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పట్టించుకుంటుందా అని సినీ నటుడు, ప్రత్యేక హోదా సమాఖ్య అధ్యక్షులు శివాజీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ ప్రత్యేక హోదా కోరుతూ దీక్ష చేస్తున్నారు. ఆయన దీక్షకు శివాజీ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని బీజేపీని నమ్మవద్దన్నారు. ఎట్టి పరిస్థితుల్లో హోదా సాధిస్తామని, కేంద్రం దిగి రావాల్సిందే అన్నారు.
ఆసుపత్రికి చలసాని
ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ అనంతపురంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలను పోలీసులు భగ్నం చేశారు. శనివారం ప్రారంభమైన ఈ దీక్షలో చలసాని శ్రీనివాస్ కూర్చున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించింది. రెండు రోజులుగా ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తున్న చలసాని షుగర్ లెవెల్స్ పడిపోయాయి. బీపీ కూడా తగ్గింది.
ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందన్న వైద్యుల సూచనతో రంగప్రవేశం చేసిన పోలీసులు చలసానిని బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. పోలీసులను అడ్డుకునేందుకు కొందరు యత్నించారు. దీంతో అక్కడ ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఎట్టకేలకు చలసానిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
ఓటింగ్పై కాంగ్రెస్ విప్
రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్ర రావు ప్రవేశ పెట్టిన ప్రత్యేక హోదా ప్రయివేటు బిల్లు పైన ఈ నెల 13వ తేదీన ఓటింగ్ జరగనుంది. బిల్లు ఓటింగులో సభ్యులంతా పాల్గొనేలా చూడాలని ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి అధినేత్రి సోనియాకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడారు. రాజ్యసభలో బిల్లు పాసైతే ఏపీ భవిష్యత్తు బంగారం అవుతుందన్నారు. బిల్లు పాసయ్యేందుకు కేంద్రమంత్రి వెంకయ్య, ఏపీ సీఎం చంద్రబాబు సహకరించాలన్నారు. అయిదు వామపక్షాలు ఇప్పటికే మద్దతిచ్చాయన్నారు. కాగా, బిల్లు పాస్ కావడానికి కాంగ్రెస్ తన పార్టీ సభ్యులకు మూడు లైన్ల విప్ జారీ చేసింది. కేవీపీ పెట్టిన ప్రయివేటు బిల్లుకు మద్దతివ్వాలని పేర్కొంది.
ఏపీకి హోదా కోరుతూ అనంతలో వామపక్షాల ఆందోళన
ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అనంతపురంలో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించారు. బీఎస్ఎన్ఎల్ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని, అనంతరం విడిచి పెట్టారు.
మోడీకి కొణతాల లేఖ
ఉత్తరాంధ్రకు రూ.15 వేల కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని, ఏపీకి రాష్ట్రానికి తక్షణం ప్రత్యేక హోదా ప్రకటించి పన్ను రాయితీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ప్రధాని నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశారు.
ఉత్తరాంధ్రలో భాగమైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో దాదాపు కోటి మంది నివసిస్తున్నారని, వారిలో అత్యధికులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని పేర్కొన్నారు. 340 కిలోమీటర్ల తీరప్రాంతం ఉండి కూడా, తాగు, సాగు నీటికి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు.
రాష్ట్రంలోని జిల్లాల్లో అత్యంత వెనుకబడిన జిల్లా శ్రీకాకుళమన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో ప్రస్తావించిందని గుర్తు చేశారు. ప్రధాని మోడీ తక్షణం కల్పించుకుని ఉత్తరాంధ్ర ప్రజలు అభివృద్ధిలో పయనించేందుకు సహకరించాలని లేఖలో కోరారు.