రాజధాని కేసుల విచారణకు ధర్మాసనం: సభలో బిల్లులపై పిటీషన్లు..విచారణ: వచ్చేనెల 26కు వాయిదా..!
ఏపీ శాసనసభ ఆమోదం తెలిపిన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ చట్టం ఉపసంహరణ బిల్లుపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసుల పైన తదుపరి విచారణ జరిగి..కోర్టు మార్గదర్శకాలు ఇచ్చే వరకూ కార్యాలయాలు తరలిస్తే..వాటి ఖర్చు సంబంధిత అధికారుల వ్యక్తిగత ఖాతా నుండి రికవరీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. శాసనసభలో ఆమోదం పొందిన బిల్లులపై హైకోర్టులో ప్రజా హిత వ్యాజ్యాలు దాఖలయ్యాయి. పిటీషనర్ల తరపున ప్రముఖ న్యాయవాది అశోక్ భను వాదించగా.. ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించారు. ప్రభుత్వం ఈ రాజధాని కేసుల వాదనల కోసం ప్రత్యేకంగా ముఖుల్ రోహిత్గీని నియమించుకుంది. అదే విధంగా హైకోర్టులో వాదనల సమయంలో వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి..టీడీపీ ఎంపీ కేశినేని సైతం హాజరయ్యారు. కోర్టు లో ఇద్దరు న్యాయవాదులు తమ వాదనలు వినిపించిన తరువాత హై కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రత్యేక బెంచ్ ముందు వాదనలు
రాజధాని అమరావతి, సీఆర్డీఏ అంశాలతో ముడిపడి ఉన్న వ్యాజ్యాలన్నింటిపై విచారణ జరిపేందుకు ప్రత్యేక బెంచ్ ఏర్పాటయింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. శాసనసభ లో ఆమోదం పొందిన బిల్లులపై విచారణ నిర్వహించింది. మండలిలో బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిన విషయాన్ని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. అదే సమయంలో ప్రభుత్వ మౌఖిక ఆదేశాల ద్వారా ప్రభుత్వ కార్యాలయాల తరలింపుకు నిర్ణయించే అవకాశం ఉందని..అడ్డుకోవాలని పిటీషనర్లు అభ్యర్దించారు. అదే సమయంలోప్రభుత్వం ప్రవేశ పెట్టినది మనీ బిల్లు కాదని ప్రభుత్వ న్యాయవాది మరోసారి స్పష్టం చేసారు.

సాధారణ బిల్లులే అంటూ..
అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. అవి రెండూ సాధారణ బిల్లులేనన్నారు. స్పీకర్ కూడా అవి ద్రవ్యబిల్లులని సర్టిఫికేషన్ ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం శాసనమండలిలో తీసుకున్న నిర్ణయం మేరకు సెలెక్ట్ కమిటీకి బిల్లును రిఫర్ చేసారని వివరించారు. అవి ద్రవ్యబిల్లులు కావని ఏజీ కోర్టుకు చెప్పిన విషయాన్ని నమోదు చేయాలని అశోక్భాన్ కోరగా ధర్మాసనం అంగీకరించింది. సెలెక్ట్ కమిటీ నివేదిక అందించేందుకు మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని కోర్టుకు నివేదించారు. దీంతో.. తదుపరి విచారణకు వచ్చే నెల 26వ తేదీకి వాయిదా వేసింది. అయితే, దీనితో పాటుగా రాజధానికి సంబంధించిన అన్ని కేసులను అదే రోజు విచారించిన ధర్మాసనం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications