హైపవర్ కమిటీ తొలి భేటీ: ఏం తేలుస్తారు: అదే బాటలోనా..మార్పులుంటాయా..!
ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదనల పైన కీలకమైన హైపవర్ కమిటీ సమావేశం కానుంది. ఇప్పుడు ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే రాజధాని అంశం పైన జీఎన్ రావు.. బీసీజీ కమిటీలు ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగానే నివేదికలు ఇచ్చాయి. అయితే, ఆ రెండు కమటీల సిఫార్సుల సారాంశాన్ని క్రోడీకరించి..కీలక సిఫార్సులు..సూచనలు ఇవ్వాలంటూ ప్రభుత్వం ఈ హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది.
పది మంది మంత్రులతో పాటుగా ఆరుగురు కీలక అధికారులు ఈ కమటీలో సభ్యులుగా ఉన్నారు. అయితే, ముఖ్యమంత్రి ఆలోచనలు స్పష్టం కావటంతో.. ఈ కమిటీ సైతం ఆ రెండు కమిటీల సిఫార్సులకే ఆమోద ముద్ర వేస్తుందా..లేక తాజా పరిస్థితులను పరిగణలోకి తీసుకొని కొత్త ప్రతిపాదనలు చేరుస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.

హైపవర్ కమిటీ భేటీలో ఏం తేలుస్తారు...
రాజధాని వ్యవహారం కీలక దశకు చేరుకుంది. శాసనసభా శీతాకాల సమావేశాల చివరి రోజున ముఖ్యమంత్రి సభలో మూడు రాజధానుల ప్రతిపాదన చేసారు. అదే అంశం పైన అప్పటికే ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ..బోస్టన్ కమిటీలు ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా నివేదికలు ఇచ్చాయి. అయితే, ఈ కమిటీల నివేదికల పైన ఆరోపణలు..అభ్యంతరాలు సైతం వ్యక్తం అయ్యాయి.
ఇక, దీంతో..ప్రభుత్వం ఈ రెండు కమిటీల సిఫార్సులను అధ్యయనం చేసే బాధ్యతను మంత్రులు..అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి వారికి అప్పగించారు. ఈ రోజు మధ్నాహ్నం విజయవాడ సీఆర్డీఏ కార్యాలయంలో ఈ కమిటీ తొలి భేటీ జరగనుంది. ఇప్పటికే ప్రభుత్వానికి అందిన రెండు కమిటీల నివేదిక పైన ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. పాలనా వికేంద్రీకరణ ..ప్రాంతాల మధ్య సమతుల్యత అనే అంశం ఆధారంగా ఈ ప్రతిపాదన లు చేసామని ఆ రెండు కమిటీలు తేల్చి చెప్పాయి.

ఆమోదిస్తారా..మార్పులు సూచిస్తారా..
అయిదేళ్ల కాలంగా.. రాజధానిగా ఉన్న అమరావతిని కాన్స్టిట్యూషనల్ క్యాపిటల్గా మాత్రమే ఉంచి, సచివాలయం, సీఎం క్యాంప్ ఆఫీస్ తదితరాలను విశాఖపట్టణానికి(ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్), హైకోర్టును కర్నూలుకు(జ్యుడీషియల్ క్యాపిటల్) మార్చాల్సిందిగా జీఎన్ రావు, బీసీజీ కమిటీలు తమ నివేదికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సూచించాయి. అయితే, ఆ ప్రతిపాదనలు వెలుగులోకి వచ్చిన సమయం నుండి అటు అమరావతిలో నిరసనలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. అదే విధంగా రాయలసీమ నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కీలక శాఖల అధికారులతో ఏర్పాటైన ఈ కమిటీ
ఈ పరిస్థితుల్లో మూడు ప్రాంతాలకు చెందిన మంత్రులతో పాటుగా కీలక శాఖల అధికారులతో ఏర్పాటైన ఈ కమిటీ ఆ సిఫార్సులనే ఆమోదిస్తారా..లేక ఏవైనా మార్పులు సూచిస్తారా అనేది ఇప్పుడు కీలక అంశంగా మారింది. అయితే, ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగానే అన్నీ జరగుతు న్నాయని..ఈ కమిటీ సైతం ఆ రెండు కమిటీల తరహాలోనే మూడు రాజధానులకే ఓటు వేసే అవకాశం కనిపిస్తోందనే అభిప్రాయం ఉంది. ఈ కమిటీ నివేదిక అధికారికంగా అందిన తరువాత ప్రభుత్వం దీనికి అసెంబ్లీలో ఆమోద ముద్ర వేయాలని భావిస్తోంది.












Click it and Unblock the Notifications