కుప్పం సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో విగ్రహాల ధ్వంసం... చంద్రబాబు ఫైర్... సీబీఐ విచారణకు డిమాండ్...
చిత్తూరు జిల్లాలో సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో విగ్రహాల ధ్వంసం తీవ్ర కలకలం రేపుతోంది. కుప్పం మండలం బిరుదన్నపల్లి గ్రామంలో బేటగుట్టపై ఉన్న సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలోని విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దేవతామూర్తుల విగ్రహాలను విరగ్గొట్టి ఆలయం బయట పడేశారు. సుమారు 200 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయంపై దుండుగలు దాడి చేయడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో విగ్రహాల ధ్వంసం ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్లో స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత, నిర్లక్ష్యం వల్లే విగ్రహాల ధ్వంసం, దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. బేటగుట్టపై శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలోని విగ్రహాల ధ్వంసం అత్యంత బాధాకరమన్నారు. ఒకటా... రెండా... వందల కొద్దీ ఘటనలు జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా విగ్రహాల ధ్వంసంపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో చోటు చేసుకున్న విగ్రహాల ధ్వంసం ఘటలన్నింటిలో నిందితులను అరెస్ట్ చేయాలన్నారు.
చిత్తూరుజిల్లా, కుప్పం మండలం గోనుగూరు సమీపంలోని బేటగుట్టపై శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలోని విగ్రహాల ధ్వంసం అత్యంత బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత, నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం, దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి.(1/2) pic.twitter.com/Ow2islJ58W
— N Chandrababu Naidu (@ncbn) April 6, 2021
రెండు నెలల క్రితం వరకూ ఆంధ్రప్రదేశ్లో చాలాచోట్ల హిందూ దేవతామూర్తుల విగ్రహ ధ్వంస ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. విజయనగరంలోని రామతీర్థలో రాముడి విగ్రహ ధ్వంసంపై పెను దుమారమే రేగింది. టీడీపీ,బీజేపీ నేతలు రామతీర్థలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రంలో దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని... జగన్ అధికారంలోకి వచ్చాకే హిందూ ఆలయాలపై దాడులు పెరిగాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీనికి అధికారపక్షం కూడా ధీటుగా కౌంటర్ ఇచ్చింది. చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లోనే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని విజయసాయి రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకే ఇలా చేస్తున్నారని విమర్శించారు.
ఒకటా రెండా? వందల కొద్దీ ఘటనలు జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది. విగ్రహ ధ్వంసం ఘటనలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీబీఐ విచారణ కోరాలి. రాష్ట్రంలో జరిగిన అన్ని ఘటనల్లో నిందితులను అరెస్ట్ చేయాలి.(2/2)
— N Chandrababu Naidu (@ncbn) April 6, 2021
కొన్నాళ్లుగా ఈ తరహా ఘటనలు తెరపైకి రాలేదు. తాజాగా సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో విగ్రహాల ధ్వంసంతో హిందూ ఆలయాలపై దాడి మరోసారి రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.