లేపాక్షిలో హెరిటేజ్ రన్: బాలకృష్ణతో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు
అమరావతి:ఫిబ్రవరి 27, 28వ తేదీలలో తన నియోజకవర్గంలో రూ. 4 కోట్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న లేపాక్షి ఉత్సవాల నిర్వహణ బాధ్యతను సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నీ తానై ముందుండి చూసుకుంటున్నారు. ఉత్సవాలను విజయవంతం చేయడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలోని లేపాక్షిలో శుక్రవారం హెరిటేజ్ రన్ జరిగింది. హెరిటేజ్ రన్లో సినీనటుడు బాలకృష్ణ, మంత్రి పరిటాల సునీత, యువతీ యువకులు పాల్గొన్నారు. లేపాక్షిలోని నంది విగ్రహం నుంచి సభాస్థలి వరకు హెరిటేజ్ రన్ కొనసాగింది. ఈ రన్లో పర్యాటకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బాలకృష్ణకు రోడ్డు పొడవునా లేపాక్షి ప్రజలు నీరాజనాలు పట్టారు. ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా శిల్పకళకు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లేపాక్షికి యునెస్కో గుర్తింపు తెస్తానని బాలకృష్ణ అన్నారు. గురువారం నిర్వహించిన 5 కిలోమీటర్ల పరుగులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేపాక్షి ఉత్సవాలకు పర్యాటక శాఖ గురువారం కోటి రూపాయలను విడుదల చేసింది.
ఈ నిధులను విద్యుత్ అలంకరణకు ఖర్చు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు ధర్మవరం చేనేత పట్టుచీరపై ప్రముఖ డిజైనర్ నాగరాజు లేపాక్షి ప్రాముఖ్యతను తెలిపే శిల్పకళను పొందుపరిచారు. ఇదిలా ఉంటే లేపాక్షి ఉత్సవాలను ఏపీ ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహిస్తుందన్నారు.
ఉత్సవాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు హాజరవుతున్నారని ఆయన తెలిపారు. లేపాక్షి ఉత్సవాలను విజయవంతం చేయాలని బాలకృష్ణ కోరారు. ఈ ఉత్సవాల్లో బాలకృష్ణ శ్రీకృష్ణదేవరాయల పాత్రలో అభిమానులకు కనువిందు చేయనున్నారు.
లేపాక్షి ఉత్సవాలకు రావాల్సిందిగా ఇప్పటికే అటు కేంద్ర మంత్రలతో పాటు, తెలుగు రాష్ట్రాల్లోని పలువురు మంత్రులను బాలకృష్ణ స్వయంగా ఆహ్వానించారు. లేపాక్షి ఉత్సవాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు పాల్గొంటారని బాలకృష్ణ వెల్లడించారు. ఉత్సవాల నిర్వహణ కోసం ఏపీ ప్రభుత్వం రూ. 4 కోట్లు కేటాయించింది.