తిరుమలకు భారీగా చేరుకున్న భక్తులు స్వల్ప తొక్కిసలాట: సర్వదర్శనం టోకెన్ల కోసం బారులు
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం భక్తులు పోటెత్తడంతో స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. జనవరి 2 నుంచి 11 వరకు 10 రోజులపాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. రోజుకు 45 వేలు చొప్పున 10 రోజులపాటు 4.5 లక్షల సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనుంది.
ఈ క్రమంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులు భారులు తీరడంతో తోపులాట జరిగింది. జనవరి 1వ తేదీ మధ్యాహ్నం నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ ప్రకటించింది.
అయితే, ముందు రోజు రాత్రి నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. తిరుమలలోని 9 ప్రాంతాల్లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. అయితే, అన్ని కేంద్రాల వద్దకు భక్తులు తరలివచ్చారు. తమిళనాడు నుంచి కూడా భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలోనే తోపులాట, స్వల్ప తొక్కిసలాట జరిగింది. పలువురు భక్తులు కిందపడిపోయారు.

సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జేఈవో
తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుండి 11వ తేదీ వరకు జరిగే వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన 9 కేంద్రాలను శనివారం జిల్లాకలెక్టర్ వెంకటరమణా రెడ్డి, టీటీడీ జేఈవో సదాబార్గవి పరిశీలించారు.
సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లు, బారికేడ్లను వారు పరిశీలించారు. ఈ కేంద్రాలవద్ద పోగయ్యే చెత్త ఎప్పటికప్పుడు తొలగించడానికి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పారిశుధ్య కార్మికులను నియమిస్తామని జిల్లా కలెక్టర్ వెంకటరమణా రెడ్డి చెప్పారు. టీటీడీ ఆరోగ్యవిభాగం అధికారులు, టోకెన్ల జారీ కేంద్రాల వద్ద ప్రత్యేక విధులకు నియమించిన టీటీడీ అధికారులు మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో పని చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. మరుగుదొడ్ల నిర్వహణ , తాగునీటి సరఫరా పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన చెప్పారు.
ప్రతి కౌంటర్ వద్ద భక్తులకు టిఫిన్, అన్నప్రసాదాలు, టీ,కాఫీ, తాగునీరు నిరంతరంగా సరఫరా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామని జేఈవో శ్రీమతి సదా భార్గవి కలెక్టరుకు తెలియజేశారు. జనవరి 1 నుంచి టోకెన్ల జారీ ప్రారంభించి కోటా పూర్తి అయ్యేవరకు నిరంతరంగా జారీ చేయడానికి ఏర్పాట్లు చేశామని ఆమె తెలిపారు. ప్రతి కేంద్రం వద్ద తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశామని, వాటి నిర్వహణకు అవసరమైనంత మంది సిబ్బందిని నియమించామని ఆమె వివరించారు. రామచంద్ర పుష్కరిణి, ఇందిరామైదానం, శ్రీనివాసం, విష్ణునివాసం, గోవిందరాజస్వామి సత్రాల వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసుల సహకారంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ టీటీడీ అధికారులకు సూచించారు. ఈ విషయమై జిల్లా ఎస్పీ ఇప్పటికే తగిన ఆదేశాలు జారీ చేశారని ఆయన చెప్పారు.
నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా, టోకెన్లు ఏ తేదీ ఏ సమయానికి జారీ చేస్తున్నారనే వివరాలు భక్తులకు తెలిసేలా ఏర్పాటు చేసిన ఎల్ఈ డి స్క్రీన్లు సక్రమంగా పని చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications