ఉగాది పండుగ నుంచి కూత పెట్టనున్న హైదరాబాద్ మెట్రో రైలు
హైదరాబాద్: హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మెట్రో రైలు మార్చి 21వ తేదీ నుంచి కూత పెట్టనుంది. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం రోజు నుంచి అది అధికారికంగా పట్టాలు ఎక్కుతుంది. మొదటి దశ మెట్రో రైలు మాత్రమే ఆ రోజు నుంచి అందుబాటులోకి వస్తుంది. హైదరాబాదులోని నాగోలు నుంచి మెట్టుగుడా వరకు ఈ రైలు నడుస్తుంది. ప్రయాణికులు ఉగాది నుంచి దాన్ని వాడుకోవచ్చు.
ప్రస్తుతం నాగోల్ - మెట్టుగూడ మార్గంలో మెట్రో రైళ్లను ప్రయోగాత్మకంగా టెస్ట్ రన్ ఇప్పటికే చేస్తున్నారు. ఆగస్టు నుండి పలు టైస్ట్ డ్రైవ్లు చేస్తున్నారు. ఏటీవోను ఇటీవల తొలిసారి పరీక్షించారు. కమ్యూనికేషన్ ఆధారిత ట్రెయిన్ నియంత్రణ వ్యవస్థ (సీబీటీసీ)ను భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా మెట్రోలో అమలు చేయనున్నారు. ప్రపంచంలో మొదటిసారిగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఫ్రాన్స్కు చెందిన థాలేస్ కంపెనీ హైదరాబాద్ మెట్రోకు అందిస్తోంది. ఈ రేడియో సమాచార ఆధారిత వ్యవస్థ రైళ్ల గమనాన్ని నిరంతరం ప్రసారం చేస్తుంది.
ఒక విధంగా చెప్పాలంటే రైళ్లు ఒకదానితో ఒక్కటి రేడియో ద్వారా మాట్లాడుకుంటాయన్నమాట. మెట్రో రైలులోని సాంకేతిక వ్యవస్థ మొత్తం ఆరు జోన్లుగా ఉంటుంది. జోన్ కంట్రోలర్ ద్వారా ప్రతి రైలు ఉనికిని, గమనాన్ని, వేగాన్ని మిగతా రైళ్లకు నిరంతరం తెలియజేస్తుంది. ఆ మేరకు రైళ్లు తమ వేగాన్ని నియంత్రించుకుంటూ అవసరమైనప్పుడు వాటంతట అవే బ్రేకులు వేసుకుంటాయి.
ఆటోమేటిక్ ట్రైన్ సూపర్ విజన్, ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటేక్షన్, జోన్ కంట్రోలర్, డేటా కమ్యూనికేషన్ తదితర అనేక ఉపవ్యవస్థలు, మెట్రో రైళ్లు సురక్షితంగా రాకపోకలు సాగించేందుకు, ఢీకొట్టకుండా ఉండేలా పర్యవేక్షిస్తాయి. మానవ తప్పిదాల కలిగే ప్రమాదాల నుండీ, హెచ్చరిక సంకేతాలను దాటి రైలు ముందుకు వెళ్లకుండా ఈ సాంకేతిక పరిజ్ఞానం కాపాడుతుంది. ఆటోమెటిక్ ట్రెయిన్ ఆపరేషన్ వ్యవస్థకు సంబంధించి మెయిన్ కంట్రోల్ను ఉప్పల్ డిపోలో ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా మొత్తం 72 కిలోమీటర్ల పొడవునా హైదరాబాద్ మెట్రోరైలు వ్యవస్థ పనిచేస్తుంది.