నిశిత్ చిన్ననాటి నుంచీ తెలివైనవాడు: ప్రమాదానికి అసలు కారణమిది?
నగరంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ కుమారుడు చిన్ననాటి నుంచే తెలివైన వాడు.
హైదరాబాద్: నగరంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ కుమారుడు చిన్ననాటి నుంచే తెలివైన వాడు. చదువులోనూ ముందుండేవాడు. అంతేగాక, తండ్రి ప్రారంభించిన విద్యా సంస్థల నిర్వహణలో అడుగుపెట్టి రాణిస్తున్నాడు. త్వరలోనే సంస్థ కీలక బాధ్యతలు చేపడతాడని అనుకుంటున్న తరుణంలోనే అతని మరణం నారాయణ కుటుంబంలో తీరని శోకం మిగిల్చింది.

ఒక్క కుమారుడు
బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్లో జరిగిన కారు ప్రమాదంలో నిశిత్ దుర్మరణం పాలయ్యాడు. నారాయణకు అతడు ఒకే ఒక్క కుమారుడు, కాగా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే... విద్యా సంస్థల చైర్మన్ పదవిని వదులుకున్నారు నారాయణ. తన పిల్లలను వాటి డైరెక్టర్లుగా చేశారు.

తెలివైన వాడు, సామాజిక సేవ
నిశిత్ ఇంజనీరింగ్, వైద్య కాలేజీల బాధ్యతలతోపాటు.. మొత్తం విద్యా సంస్థల బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్, నెల్లూరు, బెంగళూరులో విద్యాభ్యాసం అనంతరం... నిశిత్ సింగపూర్లో బీబీఏ పూర్తి చేశారు. 8వ తరగతిలో ఉండగానే.. జంతుజాలం, మనుషుల మనస్తత్వాలపై ‘అమేజాన్ ఫ్యాక్ట్స్' అనే పుస్తకం రాశారు.
జంతువులు, మనుషుల ఆలోచనల విధానాలను అందులో పొందుపరిచారు. ఈ పుస్తకం ప్రతులు విక్రయించగా వచ్చిన సొమ్మును సామాజిక సేవకు ఉపయోగించారు.

తండ్రికి అండగా
నిశిత్ రాజకీయాల్లోనూ తండ్రికి అండగా నిలిచేవారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి పట్టాభి తరఫున సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. త్వరలోనే నిశిత్కు విద్యా సంస్థల చైర్మన్ బాధ్యతలను అప్పగించాలని నారాయణ భావిస్తున్నారు. అంతలోనే ఈ రోడ్డు ప్రమాదం నిశిత్ను దూరం చేసి నారాయణ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది.

ప్రమాదానికి ఓవర్ టేకే కారణం
నిశిత్.. తమను మరొక కారు అధిగమించడంతో తన కారు వేగాన్ని పెంచి, స్టీరింగ్ను నియంత్రించలేక పిల్లర్ను ఢీకొట్టినట్టు పోలీసులు భావిస్తున్నారు. కాగా, నిశిత్.. ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించడం, మూల మలుపు వద్ద వాహనాన్ని నియంత్రించుకోలేక అదుపుతప్పి పిల్లర్ను ఢీకొట్టాడని ఘటన జరిగిన సమయంలో అక్కడేవున్న శ్రీనాథ్ అనే వ్యక్తి తెలిపాడు.

అతివేగం
కాగా, ప్రమాదం జరిగిన చోట ఓ భవన నిర్మాణం కూడా జరుగుతోంది. పెద్దఎత్తున తవ్విన కందకాల నుంచి బండరాళ్లు, మట్టిని లారీల ద్వారా బయటకు తరలిస్తున్నారు. అవి వర్షపు నీటితో రోడ్డుమీదకు చేరాయి. వేగంగా వచ్చిన నిశిత్ ఆఖరు క్షణంలో వాటిని చూసి.. పక్కకు తప్పించబోయి స్టీరింగ్ను కంట్రోల్ చేయలేక పిల్లర్ను ఢీకొట్టి ఉండవచ్చనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ప్రమాద సమయంలో నిశిత్ తన కారును సుమారు 120కి.మీల వేగంతో ప్రయాణించినట్లు తెలిసింది. నిశితోపాటు అతని స్నేహితుడు రాజా రవిచంద్ర మృతి చెందారు.












Click it and Unblock the Notifications