వర్షాల వల్ల పంట నష్టాన్ని అంచనా వేసిన పవన్ కల్యాణ్: ఇళ్లల్లోనే ఉండండి..బయటికి రావొద్దంటూ
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం, దాని వెంటే ఏర్పడిన మరో అల్పపీడనం వల్ల ఏపీ, తెలంగాణల్లో అంచనాలకు మించిన వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల వల్ల హైదరాబాద్ మునకేసింది. అనేక కాలనీలు జలమయం అయ్యాయి. రోడ్లు ఛిద్రం అయ్యాయి. భారీ వాహనాలు సైతం కాగితపు పడవల్లా కొట్టుకునిపోయాయి. చాంద్రాయణగుట్టలో గోడకూలి ఎనిమిది మరణించారు. మొత్తంగా తెలంగాణలో 13, ఏపీలో ఆరుమంది మరణించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వందలాది హెక్టార్లల్లో పంట నష్టం ఏర్పడింది. రైతుల శ్రమ వరదనీటి పాలయింది.
ఈ పరిణామాల పట్ల జనసేన పార్టీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. తీవ్ర వాయుగుండం కారణంగా కురిసిన భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తినష్టం సంభవించడం దురదృష్టకరమని పవన్ కల్యాణ్ అన్నారు. ఇప్పటికే కరోనా వైరస్ వల్ల తల్లడిల్లిపోతోన్న ప్రజలకు వాయుగుండం రూపంలో ప్రకృతి తీరని శోకాన్ని మిగిల్చిందని చెప్పారు. హైదరాబాద్ పాతబస్తీలో ఎనిమిది మంది మరణించడం విషాదకరమని వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నట్లు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

ఏపీలో రైతాంగాన్ని ఈ వరదలు తీవ్రంగా దెబ్బ తీశాయని అన్నారు. వరి, మొక్కజొన్న, పత్తి, మిరప వంటి పంటలతో పాటు ఉద్యాన తోటల రైతులు నష్టపోయారని చెప్పారు. లక్షన్నరకు పైగా ఎకరాల్లో పంట నష్టం సంభవించిందని, సుమారు 400 కోట్ల రూపాయలను రైతులు నష్టపోయారని అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు బాధితులకు అండగా ఉండాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. వరదల వల్ల దెబ్బతిన్న విద్యుత్, రవాణా వ్యవస్థలను వెంటనే పునరుద్ధరించాలని అన్నారు.
ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు, రైతులకు ఉదారంగా నష్ట పరిహారాన్ని చెల్లించాలని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఆపన్నులకు అండగా ఉండాలని పవన్ కల్యాణ్.. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బాధితులను ఆదుకోవడానికి ముందుకు రావాలని ఆదేశించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారని, ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటికి రావొద్దని ఆయన సూచించారు. వాగులు, వంకలు, డ్రైనేజీలు ప్రమాదకరంగా పొంగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.












Click it and Unblock the Notifications