ఎవరెస్ట్ అధిరోహణకు వెళ్లిన.. హైదరాబాద్ లేడీ టెక్కీ గల్లంతు(ఫొటోలు)
ఖాట్మాండ్/హైదరాబాద్: ఎవరెస్ట్ అధిరోహించాలనే దృఢ సంకల్పంతో నేపాల్ వెళ్లిన హైదరాబాద్లోని మెహిదీపట్నం సంతోష్నగర్ కాలనీకి చెందిన పూదోట నీలిమ(28) నేపాల్లో సంభవించిన భూ కంపం తర్వాత గల్లంతయ్యింది. కాగ్నిజెంట్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్న ఆమె, తన స్నేహితోలతో కలిసి యాత్రకు వెళ్తున్నానని ఆరు నెలలుగా ఇంట్లో చెబుతూ వచ్చింది.
కాగా, ఏప్రిల్ 18న శంషాబాద్ విమానాశ్రయంలో బయల్దేరే ముందు 21మంది బృందంతో తాను ఎవరెస్ట్ అధిరోహణకు వెళ్తున్నానని చెప్పింది. విమానం బయల్దేరే సమయం కావడంతో నీలిమ తల్లిదండ్రులు ఆమెను వద్దనలేకపోయారు. ఏప్రిల్ 19న ఢిల్లీ నుంచి ఖాట్మాండ్ వెళ్లిన నీలిమ చివరిసారిగా ఏప్రిల్ 22న తల్లితో మాట్లాడింది.
భూకంపం అనంతరం ఆమె నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని తల్లిదండ్రులు శౌరయ్య, కొండవీటి పాప ఆవేదనగా తెలిపారు. మొదట తమకు ఎవరెస్ట్ అధిరోహణకు వెళతానని నీలిమ తమకు చెప్పలేదని తెలిపారు. 6 నెలలుగా యోగా, భరతనాట్యంలో సాధన చేస్తుంటే ఆరోగ్యంపై శ్రద్ధ అనుకున్నామని చెప్పారు. ఈబిసి వెళుతున్నామని చెబితే.. తాము ఏదో ప్రాంతానిక వెళుతుందని అనుకున్నాం కానీ, ఎవరెస్ట్ అధిరోహించడానికి అనుకోలేదని చెప్పారు.
ఏప్రిల్ 22వ తేదీని మాట్లాడినప్పుడు చలి ఇబ్బందిగా ఉందని తమతో చెప్పిందని నీలిమ తల్లిదండ్రులు తెలిపారు. ప్రస్తుతం ఫుడ్ క్యాంపులో ఉన్నామని, బేస్ క్యాంపు చేరుకునేందుకు ఇంకా నాలుగు రోజులు పడుతుందని, అంతర్జాతీయ పర్వతారోహకుల బృందంలో భారత్ నుంచి ఇద్దరు ముగ్గురు ఉన్నారని, బృందానికి మహిళలే ప్రాతినిథ్యం వహిస్తున్నారని తెలిపిందని చెప్పారు.
తనతోపాటు ఢిల్లీకి చెందిన నీతూ దేశాయ్ ఉన్నారని తెలిపిందని చెప్పారు. శనివారం సాయంత్రం నీలిమను టూర్కు తీసుకెళ్లిన బెంగళూరుకు చెందిన రామ్లెన్ ట్రావెల్స్ నుంచి ఫోన్ వచ్చిందని, నీలిమ బృందం ప్రస్తుతం డింగ్ చౌ గ్రామంలో సురక్షితంగా ఉందని చెప్పారని తెలిపారు. ఆ తర్వాత ఆ నెంబర్కు మళ్లీ ఫోన్ చేస్తే సమాధానం రావడం లేదని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ కూతురును క్షేమంగా తీసుకొచ్చేందుకు సహకరించాలని కోరుతున్నట్లు నీలిమ తల్లిదండ్రులు తెలిపారు.