యూటితో మాకు శాంతి: చిరు, అంత స్వార్థం లేదు: జెడి
న్యూఢిల్లీ: రాష్ట్ర రాజధాని హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాల్సిందేనని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి అంటున్నారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించి హైదరాబాదును యూటి చేస్తేనే ఆ ప్రాంత ప్రజలు కొంతమేర శాంతిస్తారని చిరు చెప్పారు.
మరోవైపు రాయల తెలంగాణ ఏర్పాటు ఖరారైపోయిందని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు కూడా ఓ అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ దిశగా బిల్లు కూడా తయారైపోయిందంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని, కచ్చితంగా కేంద్రపాలిత ప్రాంతం చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

మంగళవారం కేంద్రమంత్రి కావూరు సాంబశివ రావు నివాసంలో మంత్రులు పళ్లంరాజు, జెడి శీలం భేటీ అయ్యారు. సుదీర్ఘంగా చర్చలు జరిపారు. హైదరాబాద్ను యూటి చేయకుండా రాష్ట్రాన్ని విభజించడం సరికాదని తీర్మానించారు. మంత్రుల బృందం సమావేశం జరుగుతుండగానే కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కార్యాలయానికి వారు చేరుకున్నారు.
జివోఎం భేటీ ముగిశాక వారు షిండేను కలిశారు. తమ డిమాండ్లను పునరుద్ఘాటించారు. వీరికంటే ముందు మంగళవారం ఉదయం కేంద్రమంత్రి చిరంజీవి సైతం షిండేను కలిశారు. హైదరాబాద్ను యూటి చేయాలని కోరారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్తో జెడి శీలం భేటీ కాగా, జివోఎం సభ్యులతో ఎంపీ లగడపాటి కూడా మంతనాలు జరిపారు.
జెడిశీలం విలేకరులతో మాట్లాడుతూ "రాష్ట్ర విభజనపై భిన్నమైన కోణాలు ముందుకొస్తున్నాయి. రాయలసీమ ప్రజలు కోరుకుంటే రాయల తెలంగాణను ఏర్పాటు చేయొచ్చు. అన్ని ప్రాంతాల ప్రజలు సంతోషంగా ఉండేలా సమస్యను పరిష్కరించాలి. అంతేతప్ప... ఒకరికి సుఖాన్ని, మరొకరికి బాధను కలిగించేలా చేయకూడదు'' అని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేయటం వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదని, యూటీ చేయాల్సిందేనని వెల్లడించారు. తెలంగాణ ప్రజలు కూడా సీమాంద్రులకంట్లో సున్నం కొట్టాలని కోరుకోవటం లేదన్నారు.
తామేమీ తెలంగాణకు వ్యతిరేకం కాదని, ఇచ్చే పద్ధతి మాత్రమే బాధాకరంగా ఉందని తెలిపారు. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగానే హైదరాబాద్ను చేయాలని కోరారు. అదికూడా... పదేళ్ల తర్వాత దానికదేపోతుందని, శాశ్వతంగా యూటి చేయాలని కోరడం లేదని, అలాంటి దురాశ తమకు లేదని చెప్పారు. కేవలం కొత్త రాజధానిలో సౌకర్యాలు కల్పించుకునేంత వరకే యూటి చేయాలన్నారు.
తాము ఆర్థిక ప్యాకేజీల కోసం చూడటం లేదని, ప్రజలకు ఊరట కల్పించాలన్నదే తమ డిమాండ్ అని శీలం తెలిపారు. తమది కష్టపడి పనిచేసే నైజమని, అంతా కలిసి నవ నిర్మాణం చేసుకుంటామని తెలిపారు. ఏపీఎన్జీవో నేత అశోక్బాబు వ్యాఖ్యలపై స్పందించే స్థాయి తనది కాదన్నారు.












Click it and Unblock the Notifications