జగన్ బాధితుల సంఘం అధ్యక్షుడు: బుగ్గనపై లెక్కుంది.. వారు వెళ్తే డోంట్కేర్!
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు సాయంత్రం ఆసక్తికర వ్యాఖ్య చేశారు. నేను కూడా బాధితుల సంఘం అధ్యక్షుడిని అని ఆయన వ్యాఖ్యానించారు. రోజా సస్పెన్షన్ కేసులో హైకోర్టు తీర్పుపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
జగన్ డోంట్ కేర్.. ఎదురు ప్రశ్న!
బుగ్గనకు పీఏసీ పదవి కట్టబెట్టడం ద్వారా జగన్ పార్టీలో చర్చకు తెరలేపారు. గతంలో ఎన్నడూ కొత్తగా సభకు ఎన్నికైన ఎమ్మెల్యే ఆ పదవి చేపట్టలేదు. ప్రతిసారీ సీనియర్లకే ఆ పదవి దక్కింది. అయితే గణాంకాలు బాగా తెలియడమే కాక వాగ్ధాటి కలిగిన నేతకు పదవి ఇచ్చానని, ఇదేమీ అంత ఇబ్బంది కలిగించే విషయమేమీ కాదని జగన్ తన నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు.
నిరసన గళంపై పార్టీ నేతలు ప్రశ్నంచగా.. జగన్ అంతగా పట్టించుకోలేదని తెలుస్తోంది. పీఏసీ చైర్మన్ ఎంపిక విషయంలో పార్టీ సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారని, జ్యోతుల నెహ్రూ, అమర్నాథ్ రెడ్డిలు పార్టీకి దూరమైతే చాలా నష్టం జరుగుతుందని కొందరు జగన్ వద్ద ప్రస్తావించారట.
అయితే, వారి వాదనతో జగన్ విభేదించారని తెలుస్తోంది. తన నిర్ణయం సరైనదేనని సమర్థించుకున్నారని తెలుస్తోంది. పీఏసీ చైర్మన్ గా లెక్కలు తెలిసిన, సరైన, సమర్ధుడైన వ్యక్తి కావాలని, ఈ విషయాన్ని నేను నెహ్రూతోనూ చెప్పానని, రాజేంద్రనాథ్ రెడ్డికి ఇచ్చినా ఫర్వాలేదని నెహ్రూ కూడా అంగీకరించారని, ఇక ఇందులో తప్పేముందని జగన్ అడిగిన వారిని ఎదురు ప్రశ్నించారని తెలుస్తోంది.
వైసిపిలోకి ఆనం వర్గీయులు
వైయస్ జగన్ బుధవారం నెల్లూరుకు రానున్నారు. ఈ విషయాన్ని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, మరో ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు చెప్పారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకులు ఆనం విజయ కుమార్ రెడ్డి ఇటీవల జగన్ సమక్షంలో వైసిపిలో చేరిన విషయం తెలిసిందే. ఈ రోజు (బుధవారం) ఆయన అనుచరులు, సన్నిహితులు వైసిపిలో చేరనున్నారు. కస్తూరిదేవి గార్డెన్సులో ఏర్పాటు చేసిన సమక్షంలో వారు జగన్ పార్టీలో చేరనున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాట్లను ఎంపీ మేకపాటి, ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పార్టీ అధ్యక్షులు జగన్ బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో రేణిగుంటకు చేరుకుంటారని, అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఉదయం పది గంటలకు నెల్లూరులోని కస్తూరి గార్డెన్కు వస్తారని చెప్పారు.
అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారన్నారు. అనంతరం మాగంటలే అవుట్లో నూతనంగా నిర్మించిన పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. అనంతరం పినాకిని గెస్ట్ హౌస్ చేరుకుంటారు. అక్కడ పార్టీ శ్రేణులతో సమావేశం అవుతారు. ఆ తర్వాత రేణిగుంట నుంచి హైదరాబాద్ వెళ్తారని చెప్పారు.