సిఎం రేసులో లేను కానీ: డిఎస్, లగడపాటిపై ఆగ్రహం

ఇప్పటి వరకైతే తాను సిఎం పదవి రేసులో లేనని కానీ, అధిష్ఠానం నిర్ణయానికి మాత్రం కట్టుబడి ఉంటానని డి శ్రీనివాస్ చెప్పారు. తన సమర్థత ఏమిటో 2004, 2009 ఎన్నికల్లోనే స్పష్టమైందన్నారు. ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉంటే ఎవరూ ఆపలేరన్నారు. అయితే తెలంగాణలో బడుగు బలహీన వర్గాల వ్యక్తినే సిఎం చేస్తామంటూ అధిష్ఠానం ఇప్పటికే ప్రకటించిందని గుర్తు చేశారు. సిఎం విషయంలో సిఎల్పీని సంప్రదించిన మీదటే అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
జానారెడ్డి సమర్థ నాయకుడంటూ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సోనియా తెలంగాణ ఇచ్చారన్న హుషారుతో ప్రజలు కాంగ్రెస్కు ఓట్లు వేశారని, అత్యధిక సీట్లను గెలుచుకున్న పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు.
తమ పార్టీలో సిఎం రేసులో ఉన్నవారంతా ఓడిపోతారంటూ తెరాస నేతలే ప్రచారం చేస్తున్నారని, కానీ తాను మాత్రం సిఎం రేసులో ఉన్న కెసిఆర్ గెలుస్తారని చెబుతున్నాన్నారు. అసలు కెసిఆర్ ఓడిపోతారంటే ఏమైనా అర్థం ఉంటుందా అన్నారు. అసెంబ్లీ, లోకసభ సీట్లలో కొంత క్రాస్ ఓటింగ్ జరిగిందన్నారు. అయితే ఈ క్రాస్ ఓటింగ్ ఎవరికి లాభిస్తుందో, ఎవరిని దెబ్బ కొడుతుందో ఈ నెల 16న తెలుస్తుందని చెప్పారు.
లగడపాటి రాజగోపాల్ సర్వే గురించి ప్రస్తావించగా... కాంగ్రెస్ను బద్నాం చేయడానికే ఇలాంటి సర్వేలు నిర్వహిస్తున్నారన్నారు. కేంద్రంలో యూపిఏ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బిజెపిలోని అంతర్గత విభేదాలు నరేంద్ర మోడీని ప్రధాని కానివ్వవన్నారు. తెరాస మైండ్ గేమ్ ఆడుతోందన్నారు. ప్రాంతాయ పార్టీల మద్దతుతో యూపిఏ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు.












Click it and Unblock the Notifications