పాణ్యం టిక్కెట్టు నాదే: గౌరు , వచ్చే ఎన్నికల్లో పాణ్యం నుండే పోటీ: కాటసాని, ఏం జరుగుతోంది?
కర్నూల్:కర్నూల్ జిల్లా పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ టిక్కెట్టును వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ తనకే కేటాయిస్తారని వైసీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి చెప్పారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీలో చేరడం వల్ల తమ పార్టీ మరింత బలోపేతం కానుందన్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో తాను కూడ పాణ్యం నుండే పోటీ చేస్తానని కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రకటించడం సర్వత్రా ఆసక్తిని కల్గిస్తోంది.
మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఏప్రిల్ 29వ తేదిన వైసీపీలో చేరనున్నారు. ఈ మేరకు ఇటీవల కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకొన్న రాంభూపాల్ రెడ్డి వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు వైసీపీ చీఫ్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
బిజెపికి కాటసాని షాక్: పార్టీ మారడంపై రెండు రోజుల్లో ప్రకటిస్తా, వచ్చే ఎన్నికల్లో పాణ్యం నుండే పోటీ
అయితే వచ్చే ఎన్నికల్లో పాణ్యం నుండి పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రకటించారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీలో చేరితే పాణ్యం టిక్కెట్టు ఎవరికి దక్కుతోందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
నాకే పాణ్యం టిక్కెట్టు
కర్నూల్ జిల్లా పాణ్యం టిక్కెట్టు తనకే దక్కుతోందని సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి చెప్పారు. కర్నూల్ జిల్లాలో వైసీపీ నుండి సుమారు 6 మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరిన తర్వాత కూడ పార్టీ కోసం తాను పనిచేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. పార్టీ పట్ల అంకిత భావంతో ఉన్నట్టు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పాణ్యం టిక్కెట్టు తనకే వస్తోందని గౌరు చరితారెడ్డి చెప్పారు.
కాటసాని చేరితే ప్రయోజనమే
మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీలో చేరితే పార్టీ మరింత బలోపేతం అవుతోందని ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి చెప్పారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పాణ్యం నుండి పోటీ చేసి గౌరు చరితారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు. 2009 వరకు ఆయన కాంగ్రెస్ పార్టీ తరుపున ఈ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించారు.ఎన్నికల తర్వాత కాటసాని రాంభూపాల్ రెడ్డి బిజెపిలో చేరారు. ప్రస్తుతం బిజెపి నుండి వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు.
వైసీపీ టిక్కెట్టు ఎవరికి
పాణ్యం నియోజకవర్గం నుండి వచ్చే ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్టు ఎవరికి దక్కుతోందనే విషయమై సర్వత్రా ఆసక్తికరమైన చర్చ ఇప్పటి నుండే ప్రారంభమైంది. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కూడ వచ్చే ఎన్నికల్లో పాణ్యం నుండే పోటీ చేస్తానని ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కూడ వచ్చే ఎన్నికల్లో తనకే టిక్కెట్టు వస్తోందని తాజాగా ప్రకటించడం చర్చకు దారితీస్తోంది. వీరిద్దరూ కూడ ఇదే సీటు విషయమై పట్టుబడితే పార్టీ అధినేత జగన్ ఏ నిర్ణయం తీసుకొంటారనేది ఆసక్తిగా మారింది.
బిజెపికి రాజీనామా
మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి బిజెపికి రాజీనామాలు చేశారు. కాటసాని రాంభూపాల్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడ బిజెపికి రాజీనామా చేశారు. తన అనుచరులతో కలిసి ఏప్రిల్ 29న జగన్ పాదయాత్ర జరిగే ప్రాంతానికి వెళ్ళి వైసీపీలో చేరనున్నట్టు కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రకటించారు.