తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ఎప్పుడంటే.. రికార్డు స్థాయిలో..!!
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో వడగాల్పుల హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఇప్పటికే ప్రవేశించాల్సిన రుతుపవనాల రాక ఆలస్యం అవుతోంది. ఎప్పుడు ప్రవేశిస్తాయనే దాని పైన వాతావరణ శాఖ తాజా అప్ డేట్ ఇచ్చింది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకున్నాయి వచ్చే నాలుగు రోజులు ఎండల తీవ్రత మరింత పెరిగే ప్రమాదముందని విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది.
భారీగా ఉష్ణోగ్రతలు:ఏపీ, తెలంగాణలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదువుతన్నాయి. ఏపీలో అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లా వరదరాజపురంలో 45, ఏలూరు జిల్లా పంగిడిగూడెంలో 44.9, ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లో అత్యధికంగా 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఏపీలో అల్లూరి, తూర్పు గోదావరి, క్రిష్ణా, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, గుంటూరు జిల్లాలోనూ ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 44 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. బుధవారం 12 మండలాల్లో తీవ్ర వడగాలులు, 218 మండలాల్లో వడగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠంగా 45 నుంచి 47 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని అంచనా వేసింది.
వడగాల్పుల హెచ్చరికలు:తెలంగాణలో 11 జిల్లాలకు వాతావరణ శాఖ వడగాల్పుల హెచ్చరికలు చేసింది. నాలుగు రోజుల పాటు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉండే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చింది.
మరోవైపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మంగళవారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. నిర్మల్ జిల్లా పొంకల్లో అత్యధికంగా 2.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగర్కర్నూల్ జిల్లా పాద్రాలో 2.8, జగిత్యాల జిల్లా మన్నెగూడెంలో 2.4, నాగర్కర్నూల్ జిల్లా వాంకేశ్వర్లో 2.3, జగిత్యాల జిల్లా ఐలాపూర్లో 1.6 సెంటీ మీటర్ల వర్షం కురిసింది.
17న రుతువపనాల రాక:ఇప్పటికే ప్రవేశించాల్సిన రుతుపవనాలు మరింత ఆలస్యం కానున్నాయి. మరో రెండు రోజుల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఫలితంగా ఈ నెల 17 లేదా 18 తేదీల్లో ఏపీలోని రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అరేబియా సముద్రంలో వాయుగుండం ఏర్పడంతో రుతుపవనాలు గమనం నెమ్మదించినట్టు వాతావరణ అధికారులు చెబుతున్నారు. జూన్ మూడో వారం చివరి నుంచి వర్షాలు కురవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
మరో రెండు వారాలపాలు ఎండలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నెల మూడో వారంలో బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. దీంతో, 17వ తేదీ వరకు ఈ ఉష్ణోగ్రతలు భరించక తప్పేలా లేదు.












Click it and Unblock the Notifications