ఏపీలోని ఈ జిల్లాలకు గుడ్ న్యూస్
AP Rains: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మొన్నటివరకు ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షపాతం నమోదయింది. ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి.
ఆ తరువాత రుతుపవనాలు మందగించాయి. ఫలితంగా ఎండ తీవ్రత కనిపించింది. 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైన రోజులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం నెలకొంది. ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో వర్షాలు ముఖం చాటేశాయి. రుతుపవనాలు విస్తరించడానికి ప్రతికూల వాతావరణం ఏర్పడిందని ఐఎండీ అధికారులు అంచనా వేశారు.

ఈ పరిస్థితుల్లో మళ్లీ వర్షాలు ఎప్పుడు పడతాయా? అంటూ ఎదురుచూస్తోన్న రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ అందింది. నేడు, రేపు కొన్ని జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు పడొచ్చని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇదే పరిస్థితి మరో 48 గంటల పాటు కొనసాగే అవకాశాలు లేకపోలేదని అధికారులు అంచనా వేస్తోన్నారు. పిడుగులు పడే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల కింద నిల్చోకూడదని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ సూచించారు.












Click it and Unblock the Notifications